Site icon NTV Telugu

YSRCP: నారా లోకేష్‌ ఆరోపణలు.. వైసీపీ కౌంటర్‌..

Ysrcp

Ysrcp

YSRCP: తిరుమల పరకామణి విషయంలో మంత్రి నారా లోకేష్ చేసిన ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎక్స్ (ట్విట్టర్‌)లో లోకేష్ కౌంటర్ గా ట్వీట్ చేసింది వైసీపీ.. “రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్‌కు ఒక అలవాటుగా మారింది.. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే. సిగ్గు, శరం వదిలేసి బరితెగించి విషప్రచారం చేయడంలో ఇద్దరూ హేమాహేమీలు. పరకామణిలో చోరీ విషయంలోనూ చంద్రబాబువి పచ్చి అబద్ధాలు..” అని మండిపడింది వైసీపీ..

Read Also: Sunday Special: ఆదివారం స్పెషల్‌గా ఏం చేస్తున్నారు.. ఈసారి సరదాగా వీటిని ట్రై చేయండి

ఇక, “దశాబ్దాలుగా పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్‌ను పట్టుకున్నది 2023, ఏప్రిల్‌లో. అంటే వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో లోకేష్‌ నువ్వైతే పంచాయతీ చేసి రవికుమార్‌ ఆస్తులను కొట్టేసేవాడివి.. కానీ, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో పోలీసులు నిశిత విచారణ జరపడంతో, రవికుమార్‌ కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి గిఫ్ట్‌రూపంలో ఇచ్చేశారు. ఇదంతా చట్టప్రకారం, కోర్టులు నిర్దేశించిన న్యాయసూత్రాల ప్రకారం పారదర్శకంగా జరిగింది. లోకేష్‌.. నువ్వైతే పంచాయతీలు చేసి, ఈ ఆస్తులను కొట్టేసి, దొంగ పెట్టుబడుల రూపంలో ఏ దుబాయ్ కో తరలించేవాడివి.. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఓ స్లోగన్ నడుస్తోంది.. క్యాష్.. సూట్‌కేసు.. రాజేష్‌.. లోకేష్‌.. అని. ఈ ప్రభుత్వంలోని అలీబాబా అరడజను దొంగల్లో నువ్వు ఒకడివి..” అంటూ మంత్రి నారా లోకేష్‌కి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ..

కాగా, వైసీపీ గజదొంగలు శ్రీవారి సొత్తూ దోచుకున్నారు. వందకోట్ల పరకా’మనీ దొంగ’ వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటూ.. మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.. “జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. అరాచకం పెచ్చరిల్లింది. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్ అడ్రస్ చేసారు జగన్. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్… చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదలలేదు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు. కోట్ల సొత్తు కొల్లగొట్టారు. ఈ డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. ఇందులో వాటాలను తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు వందల కోట్లు రవికుమార్ దోచుకుని వెళ్లినప్పుడు టిటిడి చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. అతని మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి ప్రయత్నించారు. అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూని కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు. ఏడుకొండల జోలికి వెళ్ళవద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దు అని.. నాడు జగన్మోహన్ రెడ్డికి బతిమాలి చెప్పారు చంద్రబాబు గారు.. అయినా వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ.. ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా.. ఏం జరుగుతుందో తెలిసినా జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారు. గుడి, గుడిలో హుండీని దోచేసిన పాపాల గత పాలకుడు జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారు..” అంటూ ఓ వీడియోను షేర్‌ చేస్తూ.. ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే..

Exit mobile version