సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు.. రేపు అసెంబ్లీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. అందుకోసం.. వైఎస్ జగన్ తమ పార్టీ ఎమ్మె్ల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. శాసన సభ, మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టార్గెట్తో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Yogi Adityanath: కుంభమేళాకి 62 కోట్ల మంది భక్తులు..ఈ శతాబ్ధంలోనే అరుదైన సంఘటన..
మరోవైపు.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనుంది వైసీపీ. ప్రజా సమస్యలపై చర్చకు, ప్రజల తరపున ప్రశ్నించేందుకు ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనుంది. ప్రతిపక్ష హోదా ఉంటేనే సభలో ప్రజల తరపున ప్రశ్నించే ఛాన్స్ ఉంటుందని వైసీపీ భావిస్తుంది. అందుకోసం.. ప్రతిపక్షంగా గుర్తించాలని వైసీపీ ఇప్పటికే హైకోర్టుకెళ్లింది. ఈ విషయంలో ఇప్పటి వరకు హైకోర్టుకు తన అభిప్రాయంపై స్పీకర్ ఎటు చెప్పలేదు. ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నేత హోదా ఉంటే నిలదీస్తారని ప్రభుత్వం భయపడుతొందని వైసీపీ ఆరోపిస్తుంది. ప్రతిపక్షం లేకుండా సభను ఏకపక్షంగా నడుపుతున్నారని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో.. రేపు అసెంబ్లీకి హాజరై ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనుంది వైసీపీ.