YSRCP: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలతో పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ అత్యవసరంగా భేటీ అయ్యారు.. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై పార్టీ ఎలా స్పందించాలనే అంశంపై నేతలతో సజ్జల, బొత్స అభిప్రాయాలు పంచుకున్నారు.
అలాగే తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా జరుగుతున్న చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ నేతలు… ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఆగడాలను నిలువరించాల్సిన అవసరం ఉందని నేతలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ప్రజల్లోకి బలంగా వెళ్లి వాస్తవాలను వివరించడంతో పాటు పార్టీ నేతలకు భద్రత కల్పించేలా పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.. ఆ తర్వాత.. అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు.. వారిపై కేసులు.. ఇలా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోన్న విషయం విదితమే..
