Pawan Kalyan: అమరావతిలో నేడు జనసేన పార్టీ కీలక సమావేశం జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు నోవాటెల్లో నిర్వహించనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల చోటుచేసుకున్న ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. అదేవిధంగా పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై నేతలకు పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేయనున్నారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సమావేశానికి ముందు పవన్ కల్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటాయపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు వెంకటాయపాలెం చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు పవన్ కల్యాణ్.. ఓవైపు తనకు కేటాయించిన శాఖలలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూనే.. మరోవైపు.. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు పవన్.. ఇప్పటికే పార్టీ బలోపేతం కోసం వివిధ కమిటీలను సైతం ఏర్పాటు చేసిన విషయం విదితమే..

