AP Environment Protection Task Force: వచ్చే ఏడాది జూన్ నెలలో మొదలయ్యే గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదులలో కాలుష్య నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదుల్లోని కాలుష్య సమస్యలను గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టడం కోసం అత్యున్నత స్థాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ అధ్యక్షతన రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.
రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు పర్యటించిన పవన్ కల్యాణ్ స్వయంగా పడవపై ప్రయాణించి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ పరిశ్రమల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగర మురుగునీరు నేరుగా గోదావరి నదిలో కలవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు తాము మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావనతో వెళ్లకూడదు. ప్రతి ఒక్కరికీ పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ నదిలోకి కలిసే మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడంతోపాటు, శాశ్వత పర్యావరణ రక్షణ చర్యలను పర్యవేక్షించనుంది.
కమిటీ స్వరూపం
ఈ ప్రత్యేక కమిటీకి పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్గా వ్యవహరించనుండగా, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ), పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి కమిషనర్, పరిశ్రమల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ కమిషనర్, మత్స్య శాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈవో, దేవాదాయ శాఖ కమిషనర్, జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్-ఇన్-చీఫ్, క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ మిషన్ డైరెక్టర్, గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు.
కమిటీ ప్రధాన విధులు
ఈ ప్రత్యేక కమిటీ ప్రతి15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం అవుతుంది. గోదావరితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదుల్లోకి కాలుష్యం ఎక్కడెక్కడ నుంచి చేరుతుందో క్షేత్రస్థాయిలో గుర్తిస్తుంది. అంతేకాదు.. గుర్తించిన సమస్యలకు కాలుష్య నియంత్రణ మండలి సూచనల ప్రకారం నివారణ చర్యలను తీసుకుంటూ పనుల ప్రగతిని పర్యవేక్షిస్తుంది. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన నదీ జలాలను అందించడమే లక్ష్యంగా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది.
