Pawan Kalyan: జనసేన పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగం పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణం, నాయకత్వం బలోపేతంపై జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు.. ఈ రోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్.. పార్టీ బలోపేతంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ కేంద్ర బృందం ఇప్పటికే వివిధ నియోజకవర్గాల నుంచి శ్రేణులు, వీరమహిళలతో సమావేశాలు నిర్వహిస్తోంది. వారితో చర్చించి సూచనలు, అభిప్రాయాలు నమోదు చేస్తోంది. రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన అంశాలపై ప్రజాభిప్రాయాలు కూడా సేకరిస్తోంది. ఈ నివేదికలను పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Read Also: Samantha Ruth Prabhu : ఆ విషయంలో నాదే తప్పు.. సమంత ఎమోషనల్
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై దృష్టిసారించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.. ఈ ప్రాంతాల్లో జనసేన బలమైన శ్రేణులు ఉన్నందున, నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పార్టీ నిర్మాణం గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకూ శాస్త్రీయంగా, సమన్వయంతో చేపట్టాలని పవన్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల మాట వినడం, వారితో సమగ్ర చర్చలు జరపడం ద్వారా స్పష్టమైన వ్యూహరచన చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత బలోపేతం, రాబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ ప్రక్రియ అత్యంత కీలకంగా భావిస్తున్నారు.