Site icon NTV Telugu

YS Jagan: వైఎస్‌ జగన్‌ను కలిసిన వైద్య విద్యార్థులు.. ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ సీఎం..

Ys Jagan

Ys Jagan

YS Jagan: వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ను కలిశారు వైద్య విద్యార్ధులు.. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.. వైద్య విద్యార్ధులపై గత రాత్రి పోలీసులు దాడిచేయడం దారుణమన్న ఆయన.. ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం అందరినీ ఇబ్బందిపెడుతోంది.. వైద్య విద్యార్ధులకు న్యాయం జరిగేవరకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Read Also: BJP: ఏడు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ.. లిస్ట్ ఇదే..

విదేశాల్లో మెడికల్‌ కోర్సులు పూర్తిచేసుకుని, ఈ ప్రభుత్వ పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్ నెంబర్‌ ఇవ్వక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.. మెడికల్‌ సీట్లు రాకపోవడంతో తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, అప్పులు చేసి మరీ పిల్లలను విదేశాలకు పంపించారన్నారు వైఎస్‌ జగన్‌.. మెడికల్‌ కోర్సులు పూర్తి చేసి ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్ష, ఇంటర్న్‌షిప్‌‌ అన్ని చేసినా పీఆర్‌ నంబర్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు.. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ ఇవ్వడం లేదు.. గడువుకు మించి ఇంటర్న్‌షిప్‌ పేరిట గొడ్డుచాకిరీ చేయించుకురన్నారు. చదువులు పట్ల, విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉందని మండిపడ్డారు.. మా ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తే ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.. ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చి, మన రాష్ట్రంలో మెడికల్‌ సీట్లు పెంచేలా చర్యలు తీసుకున్నాం. ఐదు కాలేజీలు కూడా ప్రారంభించాం.. ఈ ప్రభుత్వం మిగిలిన వాటిని అడ్డుకుంది.. కేంద్రం ఇచ్చిన సీట్లను కూడా తిప్పిపంపింది.. మెడికల్‌ సీట్లు ఇస్తే, వద్దని తిప్పి పంపిన దేశంలో ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే అంటూ దుయ్యబట్టారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్..

Read Also: Tragic: మాదాపూర్ లో దారుణం.. బెట్టింగ్ ఆడొద్దన్న తండ్రిని చంపిన కొడుకు

ఇక, వైద్య విద్యార్థుల సమస్యలపై ట్వీట్‌ చేసిన వైఎస్‌ జగన్‌.. విదేశాల్లో మెడికల్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? అంటూ సీఎం చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. ఎన్‌ఎంసీ (NMC) గైడ్‌లైన్స్‌ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌(FMG) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసినా, ఎందుకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? గడచిన ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ, ఇంటర్న్‌షిప్‌ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పీఆర్‌) నంబర్‌ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాల‌కు పంపిస్తే, ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగాచూస్తూ, వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్‌లో భాగం కాదా? అని నిలదీశారు.

Read Also: Workplace Harassment: టాయిలెట్‌లో మహిళా ఉద్యోగిని వీడియో తీసిన ఇన్ఫోసిస్ ఉద్యోగి..

ఇక, డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా, ఇక్కడే, మన రాష్ట్రంలోనే, ప్రభుత్వరంగంలో 17 కాలేజీలను, వాటిద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే, చంద్రబాబు.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు అని ఆరోపించారు.. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే, వాటిని వద్దు అన్న ప్రభుత్వం, దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతికోసం స్కామ్‌లు చేస్తూ ఆ కాలేజీలను ప్రయివేటీకరించే కుట్ర చేస్తున్నారు. పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఎన్‌ఎంసీ కేటాయించిన సీట్లనుకూడా వద్దు అంటూ తిరిగి లేఖరాసి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని, కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే, వారికి పీఆర్‌ నంబర్‌ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్‌ స్టేషన్‌లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వాలని, ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు వైఎస్‌ జగన్..

Exit mobile version