IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?

Ias Srilakshmi

Ias Srilakshmi

IAS Srilakshmi: సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గత రెండేళ్లుగా ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఉన్న శ్రీలక్ష్మికి ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆమెను గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చింది. ఆ సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

అయితే అనంతర పరిణామాల నేపథ్యంలో శ్రీలక్ష్మి దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి పోస్టింగ్ లేకుండా కొనసాగారు. ఈ నెల 30న ఆమె పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, రిటైర్మెంట్‌కు కొద్ది రోజుల ముందే జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించడం ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగిన శ్రీలక్ష్మికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో ఈ నియామకం చర్చనీయాంశంగా మారింది.