Nandamuri Balakrishna: నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే తర్వాత ఏ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారు.. ఏ దర్శకుడితో సినిమా తీయబోతున్నారు.. ఏ హీరోయిన్తో జత కట్టబోతున్నాడు అని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న వేళ.. తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఓ లీక్ ఇచ్చారు బాలయ్యా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సరదా వ్యాఖ్యలతో అందరినీ అలరించారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బొజ్జల సుధీర్, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో బాలకృష్ణ చర్చించారు. ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజును “డాకూ మహారాజ్” అంటూ సరదాగా సంభోదించారు. హంద్రీనీవా నీళ్లను హిందూపురం కాకుండా మడకశిరకు తీసుకెళ్తూ రాజు “డాకూ మహారాజ్” అయ్యాడని చమత్కరించారు. దీనికి స్పందించిన ఎం.ఎస్. రాజు, వెనుకబడిన ప్రాంతమైన మడకశిరకు ఆ మేర నీటి అవసరం ఉందని, పెద్దమనసుతో చూడాలని కోరారు.
Read Also: మ్యాట్ ఫినిష్ బ్యాక్, Dimensity 6300 ప్రాసెసర్, 50MP కెమెరాతో Honor X6d బడ్జెట్ 5G ఫోన్ లాంచ్!
ఇక, హిందూపురం ప్రజలతో పాటు మడకశిర ప్రజలు కూడా అభివృద్ధి చెందాలని బాలకృష్ణ ఆకాక్షించారు.. అయితే హిందూపురానికి కూడా పది రోజుల నీటి అవసరం ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం హాజరుకాలేదా అంటూ బాలకృష్ణ ప్రశ్నించగా, గవర్నర్ ప్రసంగానికి వచ్చి 11 నిమిషాల్లోనే 11 మంది బయటకు వెళ్లిపోయారని ఇతర ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. మరోవైపు.. రాజకీయాల మధ్యలో సినిమాల చర్చ కూడా సాగింది. తదుపరి సినిమా ఏంటని ఎమ్మెల్యేలు ప్రశ్నించగా, దర్శకుడు మలినేని గోపీచంద్తో మంచి కథ కుదిరిందని బాలయ్య వెల్లడించారు. త్వరలోనే గోపీచంద్తో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ లాబీలో జరిగిన ఈ సరదా సంభాషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.