NTV Telugu Site icon

IAS Krishna Teja: ఏపీకి ఐఏఎస్‌ కృష్ణ తేజ.. డీఓపీటీ ఉత్తర్వులు

Ias Krishna Teja

Ias Krishna Teja

IAS Krishna Teja: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ ఐఏఎస్‌ అధికారి పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది.. ఆయనే కేరళ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఎం. కృష్ణ తేజ.. ఆయన డిప్యూటేషన్‌పై ఏపీకి వస్తారని.. కీలక బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం సాగింది.. దానికి అనుగుణంగానే ఐఏఎస్‌ కృష్ణ తేజకు డిప్యూటేషన్‌పై ఏపీకి వెళ్లేందుకు అనుమతి వచ్చేసింది.. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (DoPT) ఉత్తర్వులు జారీ చేరసింది.. ఇక, పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలను కృష్ణ తేజకు అప్పగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..

Read Also: MLA Rajasingh: తెలంగాణకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా.. సీఎంకు రాజాసింగ్ రిక్వెస్ట్

అయితే, గత నెలలో సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు ఐఏఎస్‌ కృష్ణతేజ.. ఆ తర్వాత కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ కోరడం.. కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లేఖ రాయడం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.. మొత్తంగా ఎప్పుడు డీఓపీటీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. త్వరలోనే ఏపీలో ఛార్జ్‌ తీసుకోనున్నారు కృష్ణతేజ.. ఇక, గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా సేవలు అందించారు కృష్ణ తేజ.. ఆయన స్వస్థలం.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట.. ఇక, ఈ మధ్యే త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్‌ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్‌ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు.. 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన.. వివిధ శాఖల్లో పనిచేశారు.. ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తూ వచ్చారు.. ఇప్పుడు ఏపీలో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.