Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్‌బోర్డులు.. పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు..

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: అమరావతిలో పంచాయతీరాజ్ మరియు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, పారదర్శకత, రోడ్ల నిర్మాణాలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థలు చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు స్పష్టంగా తెలియాలంటే ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు, వాటి పురోగతి, రోడ్ల పరిస్థితి వంటి వివరాలు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా పన్నులు వసూలు చేయడం అభినందనీయమని పవన్ పేర్కొన్నారు. పంచాయతీలు తమ ఆదాయ వనరులను మరింత పెంచుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా సమష్టి కృషిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. శాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అమలు చేస్తున్న స్వచ్ఛరథాల విధానం మంచి ఫలితాలను ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పొడి వ్యర్థాలను అందించి, వాటికి బదులుగా నిత్యావసర వస్తువులు తీసుకెళ్లడం మంచి పరిణామమన్నారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీన్ని మరింత విస్తరించే దిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు.

తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన “గ్రీన్ షాప్” విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని పవన్ కల్యాణ్‌ ఆదేశించారు. ప్రజలు పొడి వ్యర్థాలను గ్రీన్ షాప్‌లలో ఇచ్చి నిత్యావసరాలు పొందే విధానంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. దీని ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛరథాల ద్వారా ఏప్రిల్ నెలలో 18.86 లక్షల కిలోల చెత్తను సేకరించామని, వాటి విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వివరించారు. ఈ విధానం పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని సమావేశంలో అభిప్రాయపడారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు నిర్దిష్ట గడువులో నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి పనికి ముందుగానే పూర్తి గడువు నిర్ణయించి, ఆ మేరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల వినతుల ద్వారా వచ్చే ప్రతి రోడ్డు నిర్మాణ పనిని అత్యంత జవాబుదారీతనంతో పూర్తి చేయాలని సూచించారు. రోడ్ల విషయంలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, క్షేత్రస్థాయి పరిశీలనలు నిరంతరం నిర్వహిస్తేనే అసలు పరిస్థితి తెలుస్తుందని అన్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌…