CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించినా కూటమి విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అన్ని సర్వేల్లోనూ మరోసారి కూటమి గెలుపు ఖాయమని చెబుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో మరింతగా పనిచేస్తూ పార్టీకి బలం చేకూర్చాలని సూచించారు. అయితే, ‘గొడ్డలి పార్టీ’ ఫేక్ ప్రచారాలను ఆధారాలతో తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మంచి పని జరుగుతుంటే విమర్శలు చేయడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంటోందని ఆరోపించారు. డీఎస్సీ-2025 విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలను ప్రజలకు వివరించి వాటిని ఖండించాలని సూచించారు. ‘‘చెడు ప్రచారాలను వాస్తవం అనే బ్రహ్మాస్త్రంతో తిప్పికొట్టాలి’’ అని అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టుపైనా తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు విమర్శించారు. బోరింగ్ మిషన్ అడ్డంగా ఉన్న సమయంలో, పనులు పూర్తికాకముందే వెలిగొండను జాతికి అంకితం చేశామని డ్రామాలు ఆడారని ఆరోపించారు. తాను వెలిగొండను ప్రారంభిస్తే, గతంలోనే తమ కుటుంబం పూర్తి చేసిందంటూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రకు నీరు అందించే ప్రయత్నాలను కూడా వక్రీకరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. గోదావరి జలాలను తరలిస్తుంటే వాటిని పురుషోత్తపట్నం నీళ్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి గతంలో ‘గొడ్డలి పార్టీ’ అడ్డుపడిందని ఆరోపించారు. తప్పు చేయకుండా ఎవరైనా విషయాలను వక్రీకరిస్తే, దిమ్మతిరిగేలా సమాధానం ఇవ్వాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

ఏపీపీఎస్సీలో గతంలో అడ్డగోలు అక్రమాలు, అవకతవకలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ‘హిట్-రన్-హైడ్’ విధానంలో ప్రతిపక్షం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. చర్చించేందుకు అసెంబ్లీకి రావడం లేదని, సభలో చర్చ జరిగితే వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలకు తెలుస్తాయనే భయం వారికి ఉందని అన్నారు. బయట కూర్చొని అసత్యాలను పదేపదే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలను పార్టీ కార్యకలాపాల్లో తప్పనిసరిగా ఉపయోగించాలని చంద్రబాబు సూచించారు. వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తప్పుడు ప్రచారాలకు వెంటనే ఆధారాలతో సమాధానం ఇవ్వాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు మరింతగా ఎదగడానికి పార్టీ పూర్తిగా సహకరిస్తుందని చంద్రబాబు చెప్పారు. అదే స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా పనిచేయాలని సూచించారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని ప్రజలకు సేవ చేయడంతో పాటు పార్టీకి మరింత బలం చేకూర్చాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..