Site icon NTV Telugu

CM Chandrababu: రైతులకు గుడ్‌న్యూస్‌.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.. “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బాపట్ల జిల్లా వేమూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయడంతో పాటు నేరుగా వారితో సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22.79 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం రైతులకు అందజేసింది. రాష్ట్రంలో మొత్తం 16,816 గ్రామాల్లో రీ-సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభం నుంచే రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తోంది.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

జనవరిలో 4,783 గ్రామాల్లో 18.77 లక్షల పాస్ పుస్తకాలు, ఫిబ్రవరిలో 279 గ్రామాల్లో 1,16,129 పాస్ పుస్తకాలు, మార్చిలో 299 గ్రామాల్లో 1,29,298 పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ప్రభుత్వం, మొత్తం జనవరి నుంచి ఇప్పటి వరకు 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పాస్ పుస్తకాలను అందజేసింది. మార్చి 2027 నాటికి 7,518 సిగ్నల్ గ్రామాల్లో 47 లక్షల పాస్ పుస్తకాలు, ఏప్రిల్ 2027 నాటికి 2,438 నాన్-సిగ్నల్ గ్రామాల్లో 15 లక్షలకు పైగా పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రణాళిక ఉంది. మొత్తంగా 9,956 గ్రామాల్లో 62,04,000 కొత్త పాస్ పుస్తకాలను అందించనుంది ప్రభుత్వం.

ఇవాళ బాపట్ల జిల్లాలోని 8 మండలాల్లో 3,658 పాస్ పుస్తకాలు, వేమూరు నియోజకవర్గంలో 1,795 పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. రైతులకు తెలియకుండా భూ రికార్డుల్లో మార్పులు జరగకుండా ప్రభుత్వం బ్లాక్‌చైన్ టెక్నాలజీని అమలు చేస్తోంది. ఈ విధానంతో రికార్డులను తారుమారు చేయడం అసాధ్యమని అధికారులు పేర్కొంటున్నారు.

సీఎం టూర్‌ షెడ్యూల్‌
సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం, ఉదయం 10.50 గంటలకు భట్టిప్రోలు మండలం సూరేపల్లికి చేరుకొని, 11.00 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.35 గంటలకు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 2.10 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం జరిపి, సాయంత్రం 4.05 గంటలకు అమరావతికి తిరిగి చేరుకుంటారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు భూ హక్కుల భద్రతను కల్పించడం, పారదర్శక భూ రికార్డుల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం అవుతోంది.

Exit mobile version