CM Chandrababu: ఎల్ నినో ప్రభావం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

Cbn

Cbn

CM Chandrababu: ఎల్‌ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ ఏడాది అంతటా ఎల్ నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు… రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతోపాటు.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రొత్సహించాలని సూచించారు. దీని నిమిత్తం క్యాంపెయిన్ మోడ్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే ఏ ప్రాంతాల్లో ఏయే పంట సాగు చేయాలనేదానిపై రైతులకు వివరించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

పంటల బీమా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు… రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల విషయంలో కొంత గ్యాప్ ఉందని చెప్పారు. ఆలూరు నియోజకవర్గ పర్యటనలో ఉద్యోగుల పనితీరును చదివి వినిపించినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందనను అధికారుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. మరోవైపు, రంపచోడవరంలో విద్యార్థి శివాని ఆత్మహత్య చేసుకున్న ఘటనను సీఎం చంద్రబాబు అధికారుల వద్ద ప్రస్తావించారు. చదువులో టాపర్ అయిన శివాని చనిపోవడం చాలా ఆవేదన కలిగించిందని అన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు సైకో మెట్రిక్ టెస్టులను చేయించాలని విద్యా శాఖ ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల సేవలు తీసుకోవడంతోపాటు… టీచర్లకు కూడా అవసరమైన మేరకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..