Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..

Talliki Vandanam

Talliki Vandanam

Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత నిధుల జమ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 41,07,502 మంది తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది. ఈ విడత ద్వారా 64,76,590 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు.

2026–27 విద్యా సంవత్సరానికి ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ.10,120.78 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులు, 42.70 లక్షల మంది తల్లులు, సంరక్షకులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సాయం మంజూరు చేయగా, అందులో రూ.2 వేలను నిర్దిష్ట నిబంధనల ప్రకారం మినహాయించి రూ.13 వేలను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత వివరాలు, లబ్ధిదారుల సమాచారం మన మిత్ర వాట్సాప్ సేవతో పాటు లీప్ (LEAP) యాప్ ద్వారా కూడా సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

మరోవైపు, అంగన్‌వాడీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పిన విషయం విదితమే.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు బాసటగా నిలిచే ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని రకాల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పిల్లలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, అంగన్‌వాడీలతో పాటు శానిటేషన్ వర్కర్ల పిల్లలను కూడా ఈ పథకం పరిధిలోకి తెస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ నిధులను ఇవాళ విడుదల చేస్తోంది ప్రభుత్వం.. ఇందుకోసం ఇప్పటికే రూ.10,120.78 కోట్లను విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 1 నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15,000 చొప్పున ఈ ఆర్థికసాయం జమ కానుంది. ఇందులో రూ.13,000 నేరుగా తల్లి ఖాతాకు, రూ.2,000 పాఠశాల నిర్వహణకు కేటాయిస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుండగా, 42.70 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతున్నాయి..