Ram Gopal Varma: ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు.. నేడు హైకోర్టులో విచారణ

  • ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు దర్శకుడు ఆర్జీవీ..
  • నేడు హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్లపై విచారణ..
Rgv

Rgv

Ram Gopal Varma: వివాదాల సినీ దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరగనుంది.. తనపై అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు వేశారు వర్మ.. సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో ఆర్జీవీపై కేసులు నమోదు అయ్యాయి..

Read Also: CM Revanth Reddy: హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ఇక, ఇదే వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు అయ్యింది.. అయితే, ఆ కేసును క్వాష్‌ చేయాలని రామ్‌గోపాల్‌ వర్మ.. హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు.. విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది హైకోర్టు.. కానీ, ఈ కేసులో మూడు రోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన ఆర్జీవీ డుమ్మా కొట్టాడు.. వారం రోజుల గడువు కోరారు.. దీంతో.. ఈ నెల 25న విచారణకు రావాలంటూ మరోసారి రామ్‌గోపాల్‌ వర్మకు నోటీసులు పంపించారు పోలీసులు.. అయితే, ఈ లోపుగానే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఆర్జీవీ.. ఇక, ఈ వివాదం ఇక్కడితో అయిపోయిందుకోవడానికి వీలులేదు. ఆర్జీవీపై మరిన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. కడప, అనకాపల్లిలో కొత్తగా కంప్లైంట్లు నమోదయ్యాయి. ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ రావడంతో విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు పంపించారు. అయితే.. తనకు వారం రోజులపాటు సమయం కావాలంటూ తన తరఫున న్యాయవాదులతో పోలీసులను రిక్వెస్ట్ చేశారు ఆర్జీవీ.. ఇక, తనపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించే అవకాశం కూడా ఉందని.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో ఆర్జీవీ పేర్కొన్న విషయం విదితమే.