NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్‌ కల్యాణ్‌.. ట్వీట్‌ వైరల్

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టారు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్.. ఆ పార్టీ పెట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ మధ్యే 12వ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించారు.. తనకు ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి.. కీలక అంశాలను ప్రస్తావించారు పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. పార్టీ పెట్టిన నాటి నుంచి.. ఇవాళ అధికారంలో కీలక భాగస్వామిగా మారిన వరకు జరిగిన ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు.. అయితే, ఈ సందర్భంగా శుభాకంక్షలు తెలిపిన వారితో పాటు.. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదులు తెలుపుతూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు పెట్టారు.. సీఎం చంద్రబాబు మొదలు కొని.. జనసేన కార్యకర్తల వరకు ఎవరినీ వదలకుండా ప్రత్యేక ధన్యవాదులు తెలిపిన పవన్‌ కల్యాణ్ ట్వీట్లు కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.

“జనసేన పార్టీ 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని, 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్‌కి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరికి, ఎన్డీఏ పక్ష నాయకులకు, ఇతర నాయకులు, చిత్ర పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా నిర్మాణం చేయడంతో పాటుగా, సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా పనిచేసే దిశగా జనసేన పార్టీ అడుగులు వేయనుంది” అంటూ తొలి ట్వీట్ చేశారు పవన్‌ కల్యాణ్..

ఇక, “జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీరమహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేన పార్టీ 11 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 12 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడంలో అనేకమంది వేదిక మీద లేకపోయినా సరే ఎంతో కష్టపడ్డారు, సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ముందుగా ఈ వేడుకను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేందుకు, అన్ని విధాలుగా సహకరించి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసిన పోలీస్ శాఖకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, బందోబస్తులో కీలక పాత్ర పోషించిన నా కానిస్టేబుల్ సోదరులకు కృతజ్ఞతలు. అలాగే సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్‌కి పార్టీ తరఫున ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అవసరమైన వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, జయకేతనం సభ విజయవంతం అయ్యేందుకు క్షేత్రస్థాయిలో పనిచేసిన మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌, మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులు హరిప్రసాద్ గారికి, కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌కి, పిఠాపురం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్, శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, వివిధ జిల్లాల నాయకులకు, నా హృదయపూర్వక ధన్యవాదాలు” తెలుపుతూ మరో ట్వీట్‌ చేశారు..

ఆ ట్వీట్‌కు కొనసాగిస్తూ.. “అలాగే కార్యక్రమం ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పరిశీలించి, సభాస్థలం ఎంపిక నుంచి, సభ పూర్తయ్య వరకు అడుగడుగునా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ, ఏ విధమైన అసౌకర్యం జరగకుండా నిర్వహించిన జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ శివ శ్రీనివాస్‌రావు, వారి కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు. సభకు హాజరైన జనసేన శ్రేణులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు బృందాన్ని సిద్ధం చేసి, వైద్య సేవలు అందించిన డాక్టర్ సెల్ బృందానికి, సభ ప్రాంగణంలో సేవలు అందించిన వాలంటీర్ సోదరులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు, కార్యక్రమ సారాంశాన్ని చేరవేసేందుకు అన్ని విధాలుగా సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, లైవ్ కవరేజ్ అందించిన సిబ్బందికి ధన్యవాదాలు. జనసేన పార్టీ 11 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను, వివరిస్తూ వివిధ డాక్యుమెంటరీలో రూపొందించి వాటిని ప్రజలకు తెలిసేలా ప్రదర్శించిన జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం JSPShatagniTeamకి ధన్యవాదాలు. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శనలు నిర్వహించి జనసేన పార్టీ సంస్కృతులను కాపాడే విధానం తెలియజేసేందుకు కృషి చేసిన సాంస్కృతిక విభాగం కమిటీకి, హరీష్ పాయి, కళాకారులను మనస్ఫూర్తిగా అభినందిస్తునలు తెలియజేస్తున్నాను.”..

ఇక, “తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డిహైడ్రేషన్ అవ్వకుండా వారికి దారి పొడవునా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుచేసి పండ్లు, మజ్జిగ, నీరు, ఆహారం అందించిన ఫుడ్ కమిటీ విభాగానికి, స్టేజ్ డెకరేషన్, లైటింగ్, సౌండింగ్ బృందానికి, ప్రతీ ఒక్క కార్మికుడికి, కార్యక్రమం అనంతరం ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొన్న ప్రతీ ఒక్కరినీ అభినందిస్తున్నాను. సభకు స్థలాన్ని అందించిన దాతలకు, సభా వేదిక వద్ద పారిశుధ్య సేవలు అందించిన పారిశుధ్య సిబ్బందికి, వారిని సత్కరించిన ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకి ధన్యవాదాలు. కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహాయ, సహకారాలు అందించిన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బందికి, నా వ్యక్తిగత భద్రత సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం నూతన ఉత్సాహంతో, ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిస్తున్నాను.”అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ పవన్‌ కల్యాణ్‌ తన ట్వీట్లలో పేర్కొన్నారు..