AP Collectors Conference Day 2: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగనుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రెండు రోజులుగా చర్చించిన అంశాలను సమీక్షిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు సమావేశంలో ఈ-గవర్నెన్స్, ఆర్టీజీఎస్, పీజీఆర్ఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. అలాగే భూ పరిపాలనకు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, వాటి కోసం కేటాయించిన నిధులను సమర్థవంతంగా సద్వినియోగం చేస్తున్న విధానంపైనా సమీక్ష జరగనుంది.
జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ఓపెన్ ఫోరంలో చర్చించనున్నారు. కలెక్టర్ల నుంచి నేరుగా సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకోనున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందేలా అవసరమైన సూచనలు చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఎస్పీలతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రజా భద్రత, క్షేత్రస్థాయి సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో చర్చించిన అన్ని అంశాలను సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించి, భవిష్యత్లో జిల్లా పరిపాలన ఎలా ఉండాలి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు ఎలా అందించాలనే అంశాలపై కలెక్టర్లు, అధికారులకు కీలక దిశానిర్దేశం చేయనున్నారు.

