Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ

Prepaid Electricity System

Prepaid Electricity System

Prepaid Electricity System: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్లకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లను ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల్లో విద్యుత్ వినియోగం, బిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు బకాయిల సమస్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రీపెయిడ్ విధానం ద్వారా అవసరమైన మేరకు ముందుగానే రీచార్జ్ చేసుకుని విద్యుత్ వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.

ఈ కొత్త వ్యవస్థతో విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడంతో పాటు విద్యుత్ పొదుపు చేయడం, బిల్లుల భారం తగ్గించుకోవడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే వినియోగదారుల్లో బాధ్యతాయుతమైన విద్యుత్ వినియోగంపై అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ సర్వీసులన్నింటినీ వివిధ గ్రూపులుగా విభజించి ప్రత్యేక వాలెట్ వ్యవస్థ ద్వారా రీచార్జ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యుత్ ఖర్చులపై సంబంధిత శాఖలకు పూర్తి నియంత్రణ ఉండటంతో పాటు ఖర్చుల లెక్కలు మరింత స్పష్టంగా అందుబాటులోకి రానున్నాయి.

×
×
Ad

ప్రీపెయిడ్ విధానం అమలులో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (సీపీడీసీఎల్) ముందంజలో ఉంది. సీపీడీసీఎల్ పరిధిలో మొత్తం 71,174 ప్రభుత్వ విద్యుత్ సర్వీసులు ఉండగా, వాటిలో సుమారు 50 వేల సర్వీసులను నేటి నుంచి ప్రీపెయిడ్ విధానంలోకి మార్చారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలో మొత్తం 1.17 లక్షల ప్రభుత్వ సర్వీసులు ఉండగా, అందులో 34,496 సర్వీసులను ఇప్పటికే ప్రీపెయిడ్ విధానంలోకి తీసుకువచ్చారు.

అలాగే తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో రెండు లక్షలకు పైగా ప్రభుత్వ విద్యుత్ సర్వీసులు ఉండగా, ప్రస్తుతం వాటిలో నాలుగో వంతు సర్వీసులు మాత్రమే ప్రీపెయిడ్ విధానంలోకి మారినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడం, బిల్లుల బకాయిల సమస్యను నివారించడం, పారదర్శకతను పెంచడం లక్ష్యంగా ఈ ప్రీపెయిడ్ విద్యుత్ విధానం రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా విస్తరించనుంది.