AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియను దశలవారీగా నిర్వహించేలా ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం తొలుత రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ఇక, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. జూలై 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు డోర్ టూ డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలను వివరించే దిశగా ఈ ప్రచారం సాగనుంది. అదే సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను కూడా వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..

