Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..

Amaravati

Amaravati

Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది.. ఇక, రాజధాని పరిధిలోకి గ్రామాలను డెవలప్‌ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మంజూరైన రూ.904 కోట్లకు అదనంగా మరో రూ.533 కోట్లను కేటాయించడంతో మొత్తం నిధులు రూ.1,437 కోట్లకు చేరాయి.

29 గ్రామాల్లో మౌలిక వసతులకు భారీగా నిధులు
రాజధాని గ్రామాల్లో రహదారులు, ఇతర ప్రాథమిక మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. భవిష్యత్‌లో పెరగనున్న జనాభా, వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

సీసీ రోడ్లకు బదులు బీటీ రోడ్లు
అమరావతిలోని 29 గ్రామాల్లో ప్రస్తుతం ప్రతిపాదించిన సీసీ రోడ్ల స్థానంలో బీటీ రోడ్లు నిర్మించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని నేల స్వభావం, భవిష్యత్‌లో పెరిగే ట్రాఫిక్‌ను అధ్యయనం చేసిన తర్వాత రోడ్ల నిర్మాణ విధానాన్ని ఖరారు చేయనున్నారు.

ల్యాండ్ పూలింగ్ రైతు కుటుంబాలకు రుణమాఫీ
ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి ఆమోదం లభించింది. దీంతో ల్యాండ్ పూలింగ్ రైతు కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట లభించే అవకాశం ఉంది.

శాకమూరులో భారీ నిర్మాణాలు
అమరావతిలోని శాకమూరులో రూ.596 కోట్ల అంచనా వ్యయంతో సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, హెచ్‌ఆర్ భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. రాజధాని అభివృద్ధిలో భాగంగా ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు.

హోటళ్లు, స్కూళ్లకు భూముల కేటాయింపులో కొత్త విధానం
రాజధాని ప్రాంతంలో హోటళ్లు, పాఠశాలల వంటి సంస్థలకు అదనపు భూములను కేటాయించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. ఇందులో భాగంగా ఎకరాకు కనీసం రూ.10.25 కోట్ల ధరను నిర్ణయించే ప్రతిపాదన ఉంది.

తాడికొండ, కంతేరులో ల్యాండ్ పూలింగ్‌కు ఆమోదం
అమరావతి పరిధిలోని తాడికొండ, కంతేరు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు కూడా సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రాంతాల్లో భూముల సమీకరణ ప్రక్రియకు మార్గం సుగమమైంది. మొత్తంగా అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, రహదారులు, ప్రభుత్వ భవనాలు, భూముల కేటాయింపు, ల్యాండ్ పూలింగ్ వంటి అంశాలపై వరుస నిర్ణయాలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.