Maoist Threat Letters: మంత్రులకు మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖలపై ఇంటెలిజెన్స్ విభాగం స్పష్టత ఇచ్చింది. ఆ లేఖల్లో 99 శాతం ఫేక్ అని ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. తెలంగాణలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక సర్పంచ్ ఫోన్ నంబర్తో ఈ బెదిరింపు లేఖ పంపినట్లు గుర్తించినట్లు చెప్పారు. అయితే, ఇలా లేఖలు వచ్చిన విషయం ఆ సర్పంచ్కే తెలియదని వెల్లడించారు. ప్రత్యేకంగా నలుగురు మంత్రులకే ఈ లేఖలు రావడం వెనుక పెద్ద కారణాలు లేవని, బహుశా వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఇలా చేయించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బెదిరింపు లేఖలు అందిన మంత్రుల నివాసాల వద్ద భద్రత పెంచాలని సంబంధిత విభాగానికి సూచించినట్లు తెలిపారు. ఈ లేఖల వ్యవహారంపై లోతైన విచారణ కొనసాగుతోందని ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు.
కాగా, నలుగురు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే.. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్రకు మావోయిస్టుల నుంచి బెదిరింపుల లేఖలు వచ్చాయి.. అంతే కాదు.. చంపేస్తాం.. జాగ్రత్త అంటూ లేఖలో హెచ్చరించారు దుండగులు.. దీంతో, అలర్ట్ అయిన పోలీసులు లేఖల వెనుక ఎవరు? ఉన్నారు అని ఆరీ తీసే పనిలో పడ్డారు.. అందులో భాగంగానే.. అవి 99 శాతం ఫేక్ లెటర్స్ అని తేల్చారు..