NTV Telugu Site icon

ఏపీకి ఏకైక రాజధాని అమరావతే: నటుడు శివాజీ

అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు నటుడు శివాజీ సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులను కలిసి వారికి తన మద్దతును తెలియజేశారు. ఏపీ అంటేనే కులాల కుంపటి అని… ఈ కులాల కుంపట్ల మధ్య రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని శివాజీ ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు సినిమాలో సీన్‌లను బాగానే గుర్తుపెట్టుకుంటారని.. కానీ సమాజంలో జరుగుతున్న వాటిని మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదన్నారు. ప్రజలందరూ కలుషితం అయిపోయారని.. ఆ కలుషితం నుంచి బయటపడినప్పుడే భవిష్యత్ తరాలకు మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతామని హితవు పలికారు.

Read Also: అల్లుడి ప్రేమలో పడిన అత్త.. కూతురు పెళ్లిలోనే అలా చేసి…

దేశంలో రాజకీయ వ్యవస్థ బాగా భ్రష్టు పట్టిపోయిందని.. అందుకే అంబానీ లాంటి వారే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని భావిస్తున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. అమరావతిని ఏదో చేద్దామనుకుంటే అది భ్రమేనని.. అమరావతిని ఏం చేయలేరని శివాజీ స్పష్టం చేశారు. ఏపీకి ఉన్న ఏకైక రాజధాని అమరావతే అని.. ఎన్నికల్లో ఎంత డబ్బు పంచినా ఓటర్లు తమ ఆత్మసాక్షికే ఓటు వేస్తారని శివాజీ చెప్పారు. కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లాంటి వారు ఎన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని… రాజకీయ నాయకులు ఎప్పటికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే… మీడియా కూడా వర్గాలుగా విడిపోయింది అంటూ శివాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు.