జూన్ మొదటి వారంలోగా ఆంధ్రప్రదేశ్లో 42 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని ఏపీ హైకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. కోవిడ్ కేసులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, నోడల్ ఆఫీసర్లు ఉన్నా ఆసుపత్రుల్లో పట్టించుకోని పరిస్థితి నెలకొందన్న పిటిషన్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల కొరత ఉందని.. ఇప్పటి వరకు 4 వేల ఇంజక్షన్లు రాష్ట్రానికి వచ్చాయని, మరిన్ని కొనుగోలుకి సిద్ధంగా దరఖాస్తు చేశామని కోర్టుకు విన్నవించింది ప్రభుత్వం. గ్రామ వాలంటీర్ల ద్వారా బెడ్ల అందుబాటు గురించి ఇంటింటికి తెలియ చేస్తామని ఏపీ సర్కార్ తెలిపింది.. 70 రెమిడెసివర్ల వేల వైల్స్ అందుబాటులో ఉన్నాయంది. అయితే, కోవిడ్ కేర్ సెంటర్లు సిటీకి దగ్గరలో ఏర్పాటు చేయాలని సూచించింది హైకోర్టు.. కోవిడ్ కేర్ సెంటర్లకు రవాణా సదుపాయాలు కల్పించాలని పేర్కొంది.. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే సోమవారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న వాటితోపాటు మరిన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొంది హైకోర్టు.. కాగా, 9 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సుమోటో కేసులపై ఒకేసారి విచారణ జరుపుతోంది హైకోర్టు.