కరోనా మహమ్మారి మరోసారి చైనాను వణికిస్తోంది. ఎన్నడూ లేనంత తీవ్రంగా ఆ దేశం ఇప్పుడు కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అతి పెద్ద నగరం షాంఘై కరోనాతో విలవిల్లాడుతోంది. గత పది రోజులుగా అక్కడ నిత్యం 20 వేల మంది మహమ్మారి బారిన పడుతున్నారు. మంగళవారం కొత్తగా 23,000 కరోనా కేసులు నమోదయ్యాయి.
గత 23 రోజులుగా షాంఘై నగరవాసులు లాక్డౌన్తో ఆంక్షలతో పోరాడుతున్నారు. నిబంధనల అమలు పేరుతో అధికారులు చేస్తున్న ఓవర్ యాక్షన్పై జనం మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది చూసి ఇతర ప్రాంత ప్రజలు కూడా కలవరం చెందుతున్నారు. తమకూ ఆ పరిస్థితి రావచ్చని వారు భయపడుతున్నారు. మరోవైపు, లాక్డౌన్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు వారిపై నమ్మకం కుదరటం లేదు.
బీఏ.2 అనే ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఇప్పుడు దేశమంతా వ్యాపిస్తోంది. కరోనా విషయంలో చైనా చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆంక్షలను అంతే కఠినంగా అమలు చేస్తోంది. చైనాలో అత్యధిక జనాభా కలిగిన షాంఘై నగరం పూర్తిగా లాక్డౌన్ లోకి వెళ్లింది. నిత్యావసరాల పంపిణీ విషయంలో ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజలు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారు.
షాంఘై జనాభా రెండు కోట్ల అరవై లక్షలు. ఇది చైనా ఆర్థిక-వాణిజ్య రాజధాని. అత్యంత సంపన్నమైన నగరం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. ప్రపంచ ఆర్థిక కేంద్రంగా కూడా వెలుగొందుతున్న ఈ మహానగరం కరోనా కోరల్లో చిక్కుకుని దాదాపు నెల రోజులు కావస్తోంది. కోవిడ్-19 కేసుల దృష్ట్యా షాంఘైలో పరీక్షలు పెరుగుతున్నాయి. ఒక వ్యక్తిని రోజుకు రెండుసార్లు పరీక్షిస్తున్నారు. ఇందుకోసం 50,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.
ప్రస్తుత సంక్షోభం వల్ల 23 నగరాలలో దాదాపు 20 కోట్ల మంది తీవ్రంగా ప్రభావిత మయ్యారు. ఈ నగరాలు పూర్తిగానో, పాక్షికంగానో లాక్డౌన్ లోకి వెళ్లాయి. నిత్యావసరాల సమస్య తలెత్తి జనం వీధుల్లోకి వస్తున్నారు. దాంతో నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు అధికారులు డ్రోన్లు, రోబోల సాయం తీసుకుంటున్నారు.
చైనా జీరో కోవిడ్ వ్యూహానికి ఒమిక్రాన్ వేరియంట్ ఎప్పటికప్పుడు సవాలు విసురుతోంది. షాంఘై నగరంలో మార్చి 1 నుంచి 20,000 కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. గత రెండేళ్లలో నమోదైన కేసుల కంటే ఈ మార్చి నెలలో ఎక్కువ కేసులు నమోదు కావటం చైనా పాలకులను కలవరానికి గురిచేసింది. దాంతో, మొదట కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలలో లాక్ డౌన్ విధించారు. క్రమంగా కేసులు పెరగటంతో షాంఘై నగరం మొత్తం లౌక్డౌన్ లోకి వెళ్లింది.
షాంఘై వాసులు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారన్న వార్తలు చైనా అంతటా వ్యాపించాయి. దాంతో ఇతర రాష్ట్రాల ప్రజలలలో ఆందోళన మొదలైంది. నిత్యావసరాలను కొనేందుకు దుకాణాలకు పరిగెడుతున్నారు. ముందు జాగ్రత్తగా తమకు కావాల్సిన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు.
షాంఘై మాదిరిగానే దేశంలోని ఇతర నగరాలలో ప్రభుత్వం కఠినమైన జీరో-రిస్క్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు నగరాలలో ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. గ్వాంగ్జౌ నగరంలో స్కూళ్లు మూసి ఆన్లైన్ కోర్సులు ప్రారంభించారు. అవసరమైతే తప్ప స్థానికులు నగరం విడిచి వెళ్లరాదని హుకుం జారీ అయింది. వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా నిర్థారణ పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది. నెగెటివ్ వస్తేనే అనుమతిస్తారు.
రాజధాని బీజింగ్, తీరప్రాంత నగరం నింగ్బో , నాన్జింగ్ నగరాలలో కూడా కోవిడ్-19 నిబంధనలను, ప్రయాణ పరిమితులను కఠినతరం చేశారు. కరోనా పురిటిగడ్డ అయిన వుహాన్లో మెట్రో ప్రయాణీకలు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ను వెంట ఉంచుకోవాలి. మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న షాంఘై పొరుగు నగరాలు ముందు జాగ్రత్తగా తమ స్వంత ఆంక్షలను విధించాయి. 29 ప్రావిన్సులు, మునిసిపాలిటీలలో కొత్త వేరియంట్ వెలుగు చూసింది.
మరోవైపు, షాంఘై,జిలిన్, జియాన్ ప్రజలు ఎదుర్కొంటున్న లాక్-డౌన్ కష్టాలపై అధికారులు స్పందించారు. నిర్వహణాల లోపాల పట్ల ప్రజలకు క్షమాపణ చెప్పారు. వైరస్ వల్ల కలిగే ప్రమాదం కన్నా దాని నియంత్రణకు చేస్తున్న హడావుడితోనే జనం చస్తున్నారంటూ ఆన్లైన్ చర్చల్లో తీవ్రమైన ప్రశ్నలు సంధిస్తున్నారు.
వైరస్ సోకిన వ్యక్తులలో చాలా మందికి వైరస్ లక్షణాలు లేనందున జీరో-కోవిడ్ విధానం నుంచి ప్రభుత్వం తప్పుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్య వనరులను వృద్ధులకు, వ్యాది తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి మళ్లించాలని అంటున్నారు. షాంఘైలో మార్చి 1 నుంచి ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద సోమవారం 27500 కేసులు నమోదవగా వారిలో 1164 మందికి మాత్రమే వ్యాది లక్షణాలు కనిపించాయి.
మరోవైపు, కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ ఎంపిక చేసిన జోన్లలో అధికారులు లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. వ్యాప్తి తీవ్రత ఆధారంగా నగరంలోని 16 జిల్లాలను అధికారులు తిరిగి వర్గీకరించారు. గత 14 రోజులలో ఒక్క కేసు కూడా నమోదు కాని వాటని తక్కువ-రిస్క్ కేటగిరీగా ప్రకటించారు.
ఇది ఇలావుంటే, కఠిన లాక్డౌన్ల నేపధ్యంలో షాంఘైలోని తమ రాయబార కార్యాలయంలో పనిచేసే సాధారణ ఉద్యోగులు వెనక్కి రావాలని అమెరికా ఆదేశించింది.