NTV Telugu Site icon

IPL 2022: చెన్నైకి గుడ్‌ న్యూస్.. ఢిల్లీకి బ్యాడ్‌న్యూస్

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురై నిరాశలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తాజాగా జట్టులో చేరాడు. వీసా నిబంధనల్లో సాంకేతిక సమస్యల కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన మొయిన్ అలీ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. 2021లో చెన్నై టైటిల్ గెలవడంలో మొయిన్ అలీ కీలక పాత్ర పోషించాడు. అందుకే ఈ ఏడాది చెన్నై యాజమాన్యం రుతురాజ్ గైక్వాడ్, ధోనీ, జడేజాలతో పాటు మొయిన్ అలీని కూడా రిటైన్ చేసుకుంది. గత ఏడాది ఐపీఎల్‌లో చెన్నై తరఫున 15 మ్యాచ్‌లు ఆడిన మొయిన్ అలీ బ్యాటింగ్‌లో 357 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్‌లో ఆరు వికెట్లు కూడా సాధించాడు.

మరోవైపు ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచి ఊపు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు బ్యాడ్ న్యూస్ అందింది. మెగా వేలంలో ఆ జ‌ట్టు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది. గాయం కారణంగా ఇప్పటివరకు అతడు జట్టుతో చేరలేదు. పాకిస్థాన్ పర్యటనలో గాయం కావడంతో అతడు పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్‌లో తొడ కండరాలు పట్టేయడంతో మిచెల్ మార్ష్ జట్టుకు దూరమయ్యాడని ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ తెలిపాడు. ఒకవేళ మిచెల్ మార్ష్ గాయం పెద్దదైతే అతడు పూర్తిగా ఐపీఎల్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ జట్టుకు దక్షిణాఫ్రికా బౌలర్ నోర్జ్ దూరమయ్యాడు. ఇప్పుడు మార్ష్ కూడా దూరమైతే ఆ జట్టుకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.