Wedding Expenses: తెలుగు ఇళ్లల్లో పెళ్లి బాజాల సందడి మొదలైంది. గత నెలన్నర రోజులుగా అధిక జ్యేష్ఠ మాసాల వల్ల ఆగిపోయిన శుభకార్యాల హడావుడి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. జూన్ 15 నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రవేశించడంతో పెళ్లిళ్ల హడావుడి షురూ అయ్యింది. అయితే, ఈ సంతోషాల వెనుక పెళ్లి పెద్దలకు ఒక పెద్ద బడ్జెట్ సవాల్ ఎదురవుతోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సమయం చాలా తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. జూన్ 18 నుంచి జులై 9 వరకు మాత్రమే పరిమితంగా శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ జులై 15 నుంచి ఆషాఢమాసం, గురుమూఢం మొదలై ఆగస్టు 15 వరకు బ్రేక్ పడనుంది. తిరిగి శ్రావణ మాసం వస్తేనే గానీ మళ్లీ శుభకార్యాలు జరగవు. ఈ కాస్త గ్యాప్లోనే పెళ్లిళ్లు కానిచ్చేయాలని అందరూ ఒకేసారి ప్రయత్నిస్తుండటంతో మార్కెట్లో విపరీతమైన పోటీ ఏర్పడింది. సమయం తక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని పురోహితులు, ఫంక్షన్ హాళ్ల యజమానులు, డెకరేటర్లు అందరూ డిమాండ్ను బట్టి రేట్లు పెంచేస్తున్నారు.
మరోవైపు అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం తెలుగు లోగిళ్ల పెళ్లిళ్లపై గట్టిగానే పడుతోంది. యుద్ధ వాతావరణం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు, వాహనాల కిరాయిలు భారీగా పెరిగాయి. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదలను సాకుగా చూపిస్తూ క్యాటరింగ్ నిర్వాహకులు ప్లేటు ధరలను పెంచేశారు. సమాజంలో హోదా కోసం కనీసం పాతిక రకాల వంటకాలతో విందు వడ్డించడం రివాజుగా మారడంతో, ఇప్పుడు ప్లేటు ధర కనీసం రూ.500 దాటుతోంది. వీటన్నింటికీ మించి మధ్యతరగతి, పేద కుటుంబాలకు పెళ్లిలో అత్యంత కీలకమైన బంగారం కొనుగోలు భారంగా మారింది. సాంప్రదాయం ప్రకారం మంగళసూత్రాలు, గొలుసు, కమ్మలు, గాజులు వంటి కనీస అవసరాల కోసమే 5-6 తులాలు కొనాల్సి వస్తోంది. ఏడాది క్రితంతో పోలిస్తే పసిడి ధరలు విపరీతంగా పెరగడం వల్ల, కేవలం బంగారం కొనుగోలుకే ఇప్పుడు రూ.7-8 లక్షలు అవుతోంది. ఇక బంగారం ఖర్చు కాకుండా… మండపం అద్దె, డెకరేషన్, విందు భోజనాలు, ప్రయాణాలకే అదనంగా మరో రూ.5 నుంచి 10 లక్షలు ఖర్చవుతోంది. అంతర్జాతీయ పరిస్థితుల ముందటి కాలంతో పోలిస్తే, ప్రస్తుతం ఒక్కో పెళ్లికి సగటున రూ.5 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. మొత్తానికి, పెళ్లి బాజాలు మోగుతున్నా.. ఖర్చుల మోత చూసి వధూవరుల తల్లిదండ్రులు మాత్రం బడ్జెట్ ఎలా సర్దాలా అని తలలు పట్టుకుంటున్నారు.

