ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాంగం సృష్టిస్తున్నారు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి నాలుగు రెట్లు ఎక్కువగానే సీఎం జగన్.. బీసీలకు రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. దేశంలో ఏ సీఎం కూడా బీసీలకు రాజ్యాంగం రాయలేదు.. కానీ, బీసీలకు రాజ్యాంగం రాస్తున్న మొట్టమొదటి నాయకుడు వైఎస్ జగన్ అంటూ కీర్తించారు.. బీసీలను తన పక్కన కూర్చొపెట్టుకున్నారు.. మంత్రి పదవులు, ఎంపీ స్థానాలు ఇచ్చి బీసీలను గౌరవిస్తున్నారు అని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా తమకు వేరే పార్టీ అవసరం లేదని ముక్త కంఠంతో చెబుతున్నారని చెప్పుకొచ్చారు జోగి రమేష్.
ఇక, చంద్రబాబు హయాంలో తమకు అర్ధరూపాయి సాయం కూడా చేయలేదని ప్రజలే చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్… బీసీలను వాడుకుని వారి నెత్తిన టోపీ పెట్టిన చరిత్ర చంద్రబాబు సొంతం అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. బలహీన వర్గాలను సీఎం వైఎస్ జగన్.. బలవంతులుగా చేశారని తెలిపారు.. మరోవైపు.. ఏపీలో ఈ మధ్య హాట్ టాపిక్గా మారిన అమర్ రాజా కంపెనీ వ్యవహారంపై స్పందించిన జోగి రమేష్… అమర్ రాజా కంపెనీ వెదజల్లే విషం.. కార్మికుల నరనరాల్లోకి ఎక్కి విగతజీవులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కార్మికులు అనాథలుగా మారుతున్నారని తెలిపారు.