ఏపీలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని ఎస్సార్పురంలో గుర్తు తెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఘటనా స్థలం వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరుకొని ధర్నా చేపట్టారు. అంతేకాకుండా ఘటనస్థలాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ.. పోలీసులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.
అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. అయితే ఇటీవలే చంద్రయ్య అనే టీడీపీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే చంద్రయ్యను హత్యచేసింది వైసీపీ నేతలేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ ఘటన మరవకముందే వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.