తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే… ముమ్మిడివరం పంచాయతీకి చెందిన గ్రామ వాలంటీర్ లక్ష్మీకుమారి శనివారం నాడు అన్నంపల్లి వద్ద అకస్మాత్తుగా గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఈ సమాచారాన్ని వైసీపీ కౌన్సిలర్ విజయ్కు చేరవేశారు. దీంతో వైసీపీ కౌన్సిలర్ విజయ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వాలంటీర్ను కాపాడేందుకు గోదావరిలో దూకారు.
Read Also: భయం గుప్పిట్లో ప్రపంచం… సునామీలా దూసుకొస్తున్న ఒమిక్రాన్
గోదావరి నదిలో కొట్టుకుపోతున్న వాలంటీర్ లక్ష్మీని ప్రాణాలను లెక్కచేయకుండా కౌన్సిలర్ విజయ్ కాపాడారు. అయితే వాలంటీర్ను కాపాడిన విజయ్… అనుకోకుండా నదిలో గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి నదిలోకి దూకి విజయ్ను ఒడ్డుకు తీసుకురాగా అప్పటికే ఆయన మృతి చెందారు. కాగా గ్రామ వాలంటీర్ లక్ష్మీకుమారి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ముమ్మిడివరం ఆస్పత్రికి తరలించారు. వాలంటీర్ను కాపాడిన విజయ్ ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.