Site icon NTV Telugu

ఢిల్లీ హైకోర్టులో ఆసక్తికర పిటిషన్… ఎర్రకోట నాదే అంటూ వచ్చిన మహిళ

ఢిల్లీ హైకోర్టు ఆక్తికరమైన పిటిషన్ దాఖలైంది. ఢిల్లీలో ఉన్న ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానా బేగం అనే మహిళ… ఢిల్లీ రాజు బహదూర్ షా జాఫర్-2కు తానే నిజమైన వారసురాలినని ఉద్ఘాటించింది. దీంతో ఎర్రకోటను తనకు అప్పగించాలని లేదా తగిన పరిహారం చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ తన పిటిషన్ ద్వారా కోర్టును కోరింది.

1857లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వర్గాలు బహదూర్ షాను పదవీచ్యుతుడిని చేశాయని… బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఆయన ఆస్తులన్నింటినీ అక్రమంగా లాగేసుకుందని పిటిషనర్ తెలిపింది. 1960లో భారత ప్రభుత్వం బహదూర్ షా జాఫర్-2 వారసుడిగా బీదర్ భక్త్ పేరును పేర్కొన్నట్లు ఆమె వివరించింది. బీదర్ భక్త్ తన భర్తేనని, ఆయన మరణం తర్వాత 1980 ఆగస్టు 15 నుంచి భారత ప్రభుత్వం తనకు పెన్షన్ ఇవ్వసాగిందని సుల్తానా బేగం కోర్టుకు తెలిపింది. ఆ పెన్షన్ తమకు ఏ మూలకు సరిపోవడంలేదని విచారం వ్యక్తం చేసింది.

https://ntvtelugu.com/wef-programme-postponed-due-to-omicron/

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఎర్రకోటను అక్రమంగా తన అధీనంలో ఉంచుకుందని, అది తమ పూర్వీకుల ఆస్తి అని సుల్తానా బేగం పేర్కొంది. అందుకే ఎర్రకోటను తమకు అప్పగించాలని కోరుతున్నామని, 1857 నుంచి వర్తించేలా నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోర్టును డిమాండ్ చేసింది. అయితే ఈ పిటిషన్‌ను జస్టిస్ రేఖా పల్లీ ధర్మాసనం కొట్టివేసింది. ఇన్నాళ్లు ఏం చేశారంటూ ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తన క్లయింట్ నిరక్షరాస్యురాలని, అందుకే కోర్టును ఆశ్రయించలేదని వివరించే ప్రయత్నం చేశారు. ఈ వివరణ తమకు ఆమోదయోగ్యంగా లేదని జడ్జి స్పష్టం చేశారు.

Exit mobile version