NTV Telugu Site icon

ఒకరోజు ముందుగానే పార్లమెంట్‌ నిరవధిక వాయిదా..!

నేటితో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి… ఓ వైపు 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌, మరోవైపు వివిధ సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళన, నిరసన కార్యక్రమాలతో హాట్‌ హాట్‌గా సాగిన పార్లమెంట్‌ సమావేశాల్లో కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఒక రోజు ముందుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడనున్నాయి.. ఇక, మంగళవారం సభలో ప్రవేశపెట్టిన “బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు 2021”ను స్టాండింగ్ కమిటీకి పంపే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.. కాగా, పార్లమెంట్ ఉభయసభలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..

Read Also: నేడు కర్నూలుకు సీఎం జగన్‌.. విషయం ఇదే..

వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య నవంబర్ 29వ తేదీ నుంచి పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి పార్లమెంట్ ఉభయసభలు… జులై-ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల సందర్భంగా సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించిన కారణంగా సస్పెండ్ అయిన 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలన్నది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్ తో ఉభయసభల కార్యక్రమాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది.. ఇక, అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో రైతుల మృతికి కారకులని ఆరోపిస్తూ హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాని మంత్రివర్గం నుంచి తొలగించాలన్నది ప్రతిపక్ష ఎంపీల మరో డిమాండ్‌గా ఉంది.. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై తెలంగాణ ఎంపీలు ఆందోళన చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.