‘విజయగర్జన‘ సభను వాయిదా వేసింది టీఆర్ఎస్ పార్టీ.. ముందుగా ఈ నెల 15న విజయగర్జన సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు గులాబీ అధినేత కేసీఆర్.. అయితే, వరంగల్లో ఇవాళ జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ సభను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సీఎం కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.. నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్ సమావేశంలో ముక్త కంఠంతో చేసిన అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
Read Also: అయోధ్య, వేలాంకని, అజ్మీర్కి ఉచిత యాత్ర.. కేజ్రీవాల్ హామీ..!
కాగా, నాటి ఉద్యమ రథసారథిగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ’ అనే నినాదంతో కేసీఆర్ ప్రారంభించిన ధీక్షా దివస్’ నవంబర్ 29 తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు తమ అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి స్వరాష్ట్ర సాధనకు మూలమైన ధీక్షా దివస్ రోజే జరపాలని వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. తెలంగాణ విజయ గర్జన సభను నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు, చారిత్రాత్మక తెలంగాణ విజయ గర్జన సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేసుకొని ముమ్మరంగా కృషిచేస్తూ ఏర్పాట్లల్లో నిమగ్నమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు కేసీఆర్.. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను నవంబర్ 29వ తేదీకి మార్చుకోవాలని తెలిపారు.. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియచేయాలన్నారు టీఆర్ఎస్ అధినేత.