NTV Telugu Site icon

ఎమ్మెల్సీగా కౌశిక్‌ రెడ్డి.. గవర్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

హుజురాబాద్‌ ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో.. కాంగ్రెస్‌ పార్టీని వీడి.. అధికార టీఆర్ఎస్‌లో చేరారు పాడి కౌశిక్‌ రెడ్డి.. ఆ తర్వాత గవర్నర్‌ కోటాలో కౌశిక్‌ రెడ్డిని శాసన మండలికి పంపనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్‌.. దీనిపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్‌.. గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం ఆ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు కూడా పంపించారు. అయితే, గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది..

తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. కౌశిక్‌ రెడ్డి ఫైల్‌ విషయంపై కూడా స్పందించారు. పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేసిన ఫైల్‌ నా దగ్గరే ఉందన్న గవర్నర్‌ తమిళిసై.. నేను ఇంకా ఒకే చెప్పలేదన్నారు.. ఈ ఫైల్‌పై నాకు సమయం కావాలని వ్యాఖ్యానించారు. ఇది గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ కాబట్టి… నేను స్టడీ చేస్తున్నట్టు తెలిపారు తమిళిసై.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక వరకు ఆపుతారా? అంటూ అడిగిని మరో ప్రశ్నకు స్పందిస్తూ.. మీరు ఏమైనా ఊహించుకోండి.. కానీ, నేను ఆ ఫైల్‌ను స్టడీ చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో.. పాడి కౌశిక్‌ రెడ్డిని అసలు ఎమ్మెల్సీగా నియమించేందుకు గవర్నర్‌ ఆమోదం తెలుపుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.