తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 16వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది… ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీకానుంది.. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది.. ఈనెల 22 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.. ఇక, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహం, ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలి.. ప్రధానంగా ఏ అంశాలపై ప్రతిపక్షాలు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.. అనే విషయాలపై కేబినెట్లో చర్చించనున్నారని తెలుస్తోంది..
also read: కేసీఆర్ చరిత్రను కనుమరుగు చేస్తున్నారు.. ఎప్పటికీ బీజేపీ-టీఆర్ఎస్ ఒకటికావు..!
ఇక, వాసాలమర్రిలో ఇప్పటికే దళితబంధును అమలు చేసిన ప్రభుత్వం.. హుజూరాబాద్లో అమలు చేసేందుకు నిధులు విడుదల చేసింది.. ఇదే సమయంలో.. మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేసే విషయంపై తాజాగా సీఎం కేసీఆర్ సమావేశం కూడా నిర్వహించారు.. అంతేకాదు.. దళితబంధుతో పాటు ఇతర కులాలకు కూడా రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం చేసే విధంగా టీఆర్ఎస్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.. వీటిపై కూడా కేబినెట్లో కీలక చర్చ సాగే అవకాశం ఉంది. మరోవైపు.. యాదాద్రి నిర్మాణపనులు కూడా పూర్తికావస్తుండడంతో.. ఆలయ ప్రారంభోత్సవంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో.. హుజూరాబాద్ ఉప ఎన్నికలపై కూడా కేబినెట్ ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందంటున్నారు.