కలెక్టరేట్ల కమిషనరేట్ల ప్రారంభాలు.. పెద్ద వైద్యశాలల శంకుస్థాపనలూ, దత్తత గ్రామస్తులతో సహపంక్తిభోజనం ఆపైన చమత్కార ప్రసంగం,,యాదాద్రి ఆలయ నిర్మాణ పర్యవేక్షణ, షరా మామూలుగా సమీక్షలు ఆదేశాలు కీలక నిర్ణయాలు.. ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ నాయకులకు అపాయింట్మెంట్ లాకప్డెత్పై విచారణ బాధిత కుటుంబానికి ఉద్యోగ కల్పన, ఆ పైన దళిత సంక్షేమంపై అఖిలపక్ష చర్చ అందుకోసం స్వయంగా ఫోన్లు., ఎపితో నీటివివాదంపై తీవ్ర భాషలో మంత్రుల దాడి..పివి నరసింహారావు శతజయంతి వేడుకల ముగింపు సభలు ఒకటేమిటి.. ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహార శైలిలో వచ్చిన మార్పులు పెరిగిన వేగం ప్రత్యర్థులనే గాక స్వంత పార్టీవారినే ఆలోచనలో పడేస్తున్నాయి. లాక్డౌన్ అన్లాక్ అయినట్టే కెసిఆర్ మాటలూ చేతలూ కదలికల్లో ఏదో కొత్త వూపూ వ్యూహం ఏమిటా అని ప్రతివారూ ఆలోచనల్లో పడిపోతున్నారు.ఎవరికీ అందకుండా దూరంగా వుంటారనే ప్రచారానికి ఒక్కసారిగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతుంది.మరీ ముఖ్యంగా ఇటీవల ముఖ్యమంత్రిచే తొలగించబడిన తర్వాత రాజీనామా చేసి బిజెపిలోచేరిన మాజీమంత్రి ఈటెల రాజేందర్ ఆరోపణలకు ప్రత్యక్షంగానే సమాధానం చూపించాలనిబహుశా ఆయన భావించివుండొచ్చు.దానికి తోడు రెండవసారి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్న నేపథ్యంలో మరోసారి ప్రజలకు చేరువ కావడం అవసరమనీ భావించివుండొచ్చు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నాటికి టిఆర్ఎస్ పట్ల పూర్తి సానుకూల వాతావరణం పెంచుకుని ఆ స్థానం నిలబెట్టుకోవడం ఇప్పుడు టిఆర్ఎస్కు రాజకీయంగా ప్రాణప్రదమని కెసిఆర్కుబాగా తెలుసు.స్వయంగా ధనబలం వున్న రాజేందర్ బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కేంద్రంలో బిజెపి అధికారాన్ని రాష్ట్రంలో తన వ్యతిరేక శక్తుల అండదండలనూ తీసుకుని ఇక్కడ గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారని ఆయనకు బాగా తెలుసు.
వీటికి తోడు రాజకీయంగా మరో కారణం కూడా వుంది. జాతీయ రాజకీయాలు అనిశ్చితంగా వున్నందువల్ల రాష్ట్రంపైనే సర్వశక్తులూ కేంద్రీకరించి టిఆర్ఎస్ పట్టును బలోపేతంచేసుకోవడం మంచిదని కూడా ఆయన ఆలోచనగా అనుకోవచ్చు. ఆ విధంగా జాతీయ రాజకీయాలలో తమ పాత్ర గురించిన ప్రశ్నలనూ వాయిదావేసి రాష్ట్ర సంక్షేమం పార్టీ పటిష్టతే తమ తక్షణ లక్ష్యంగా పెట్టుకోవచ్చు
తెలంగాణ సాధన కోసమూ తర్వాత రాజకీయాల కోసమూ లాబీయింగ్ ఎంత చేసినా మౌలికంగా కెసిఆర్ ప్రజల్లోంచి ప్రజా ఉద్యమాల్లోంచి వచ్చిన నాయకుడే గాని అంత:పుర అంతర్గత ఎత్తులపై ౖ ఆధారపడిన వ్యక్తి కాదు.ప్రతికూలత కనిపించినపుడు ప్రజల్లోకి వెళ్లడం తనమాటలతో ఆకర్షించడం అవతలివారిపై అవసరాన్నిబట్టి గొంతు పెంచడం తగ్గించడం ఆయనకు బాగా తెలుసు. తెలంగాణ ప్రాజెక్టులను గురించి ఎప్పటికప్పుడు ప్రచారమివ్వడం,పథకాల గురించి చెప్పడం ఆయన వ్యూహంలో ముఖ్యభాగం.తన ఆలోచనల మేరకు అధికారులతో నిరంతరం చర్చిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ తను అనుకున్న రీతిలో నడుస్తుంటారు. విమర్శలు బేఖాతరుచేసినట్టు మాట్లాడటం ద్వారా ప్రతిపక్షాలను నిరాయధం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంతలో అకస్మాత్తుగా స్థానికంగా గాని రాష్ట్రస్థాయిలో గాని అందరినీ కలుపుకోతున్నట్టు కనిపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకూ ఇయనకు బాగా పనికివచ్చిన ఈ ఎత్తుగడలు ఇప్పుడు పునరావృతంచేస్తున్నట్టు కనిపిస్తుంది. బిజెపి ముందుకు వచ్చే ప్రయత్నం ఒకవైపు కాంగ్రెస్ పెనుగులాట మరోవైపు సాగుతుండగా కాంగ్రెస్ వారికి అపాయింట్మెంట్ఇవ్వడం ఇందులో భాగమే కావచ్చు. గతంలో బిజెపి నాయకులు కెటిఆర్ను కలుసుకోవడం కార్పొరేషన్ ఉప ఎన్నికలో వారికి బెడిసికొట్టినట్టే ఇప్పుడు కాంగ్రెస్ వారు దెబ్బతింటారని కొందరు అంటున్నారు గాని వాస్తవంలొ ఇది కూడా బిజెపిపై ప్రయోగించిన అస్త్రమే. దళిత మరియమ్మ లాకప్డెత్పై స్పందన వెనువెంటనే దళితుల సంక్షేమ పథకాలపై చర్చ ఆ వర్గాలను ఆకట్టుకునేందుకు అక్కరకు రావచ్చు. ఏమైనా పాలకుడు ప్రజల్లోకి రావడం, ప్రతిపక్షాలను కలుసుకోవడం చర్చించడం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామమే, ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన ఈ విధానం ఆ పార్టీకి ప్రభుత్వానికి సానుకూలత పెంచవచ్చు.అయితే వీటిలో వచ్చిన విమర్శలను సూచనలను తీవ్రంగా తీసుకుని విధానపరమైన మార్పులు చేయడం లోపాలు సవరించుకోవడం జరిగితే మరింత సార్థకత. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలపై న్యాయస్థానాల విమర్శలతో సహా సమస్యలు సవాళ్లు అనేకం వున్నాయి, ఎపి తెలంగాణ విభజన సమస్యలను కూడా సుహృద్భావ పూర్వకంగా పరిష్కరించుకోవాలి తప్ప వివాదాలు పెంచుకోవడం వల్ల ఉపయోగం వుండదు. సీనియర్ నాయకుడుగా ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఆ విషయంలోనూ చొరవ చూపవలసి వుంటుంది.