పదిహేనేళ్ల క్రితం కృష్ణానదిలో మంచాలకట్ట వద్ద నాటుపడవ మునగడంతో 61 మంది జలసమాధి అయ్యారు. నదిపై వంతెన నిర్మిస్తామని అప్పట్లో ప్రభుత్వం హడావుడి చేసినా పనులు మాత్రం శిలాఫలకాలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రమాదం మిగిల్చిన విషాదానికి తోడు పాలకులు నిర్లక్ష్యం స్థానికులను వెక్కిరిస్తోంది.
పదిహేనేళ్ల క్రితం జరిగిన విషాదం ఇంకా ఆ ప్రాంతాన్ని వెంటాడుతూనే ఉంది. ప్రస్తుత నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల సందర్భంగా జరిగిన పడవ విషాదం ఇప్పటికీ ఆ ప్రాంత వాసులు గుర్తుచేసుకుంటున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు కర్నూలు జిల్లా నుంచి భక్తులు బయలు దేరారు. రోడ్డుమార్గం లేకపోవడంతో నాటు పడవను ఆశ్రయించారు. అది కాస్త ప్రమాదానికి గురవ్వడంతో 61 మంది జల సమాధి అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. సోమశిల-సిద్ధేశ్వరం వంతెనను 110 కోట్ల రూపాయలతో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.
మంచాలకట్ట విషాదం
2007 ఫిబ్రవరి 26న వంతెన నిర్మాణానికి 81 కోట్లు విడుదల చేశారు. 2009 ఫిబ్రవరి 13న వంతెన నిర్మాణ పనులకు సంబంధించి ఫైలాన్ను ఆవిష్కరించారు. వంతెనకు అనుసంధానంగా కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 82కోట్ల వ్యయంతో డబుల్లైన్ రహదారి ని నిర్మించాలని నిర్ణయించారు. మూడేళ్లలో వంతెన పూర్తి చేయాలని, లేదంటే ఫైన్ అపరాద రుసుం చెల్లించాలని నిబంధన పెట్టడంతో కాంట్రాక్టును దక్కించుకున్న ఆదాల ప్రభాకర్రెడ్డి కోర్టుకెళ్లారు. కోర్టు స్టే ఇవ్వడంతో నిర్మాణ పనులు పెండింగ్లో పడ్డాయి. కోర్టు స్టేకు తోడు, విభజన వివాదం రేగడంతో వంతెన నిర్మాణం పనులు ముందుకు సాగలేదు. శిలాఫలకాలు, పైలాన్ తప్ప ఎలాంటి పనులు జరగకలేదు. దీంతో ఇప్పటికీ ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని పడవల్లోనే ప్రయాణిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే బాలరిష్టాలు దాటని ఈ వంతెన ఇక రాష్ట్ర విభజన తర్వాత అంతరాష్ట్ర సమస్యగా మారింది. తెలంగాణలోని పూర్వ మహబూబ్ నగర్, ఏపీలోని కర్నూలు జిల్లాలను కలిపే వంతెనగా ఇది మారడంతో వంతెన నిర్మాణాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కనపెట్టాయి. వంతెన నిర్మాణం జరిగితే కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య దూరం మరింత తగ్గడంతోపాటు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వంతెనతో పాటు రహదారి నిర్మాణాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు.
సోమశిల-సిద్దేశ్వరం వంతెన నిర్మిస్తే కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల మధ్య ప్రయాణదూరం తగ్గుతుంది. వెనకబడ్డ కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి వంతెనతో పాటు డబుల్ లైన్ రహదారి నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.