ఏపీలో ఒకవైపు కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు సంక్రాంతి సెలవుల తర్వాత తెరుచుకున్న పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరవుతున్నారని తొలిరోజు 61 శాతం హాజరు కాగా రెండోరోజు 74 శాతం విద్యార్థులు హాజరయ్యారని మంత్రి తెలిపారు. మంగళవారం రాష్ట్రంలోని కడప జిల్లాలో 82 శాతం, గుంటూరు 81 శాతం, అనంతపురం 80, కర్నూలు జిల్లాల్లో 78 శాతం, చిత్తూరు 77 శాతం అత్యధికంగా హాజరు నమోదైనట్లు మంత్రి తెలిపారు.
పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని విద్యార్థుల ఆరోగ్య భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలను నడుపుతుందని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు, టీచర్లు అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సురేష్ తెలిపారు. అయితే, విపక్షాలు మాత్రం సెలవులు పొడిగించాలని కోరుతున్నాయి.