వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు చేయాలని నిర్ణయించారు. రైతు ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు చేరనున్న సందర్భంగా ఈ సంబరాలు నిర్వహించనున్నారు. జనవరి 3 నుంచి 10 తేదీ వరకు రైతుబంధు సంబరాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ నిబంధనలు, పరిమితులకు అనుగుణంగా చేయాలని ప్రభుత్వం సూచించింది.
మేరకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలాంటి నేపథ్యంలో రైతు బంధు కార్యక్రమం ద్వారా 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరనున్న సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు మనమంతా ముందుకు కదలాలి… జనవరి మూడో తేదీ నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతు బంధు సంబరాలు నిర్వహించాలన్నారు.
తాజాగా ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు, ఒమిక్రాన్ పరిస్థితుల నేపథ్యంలో విధించిన పరిమితులను గుర్తుంచుకొని ఈ రైతుబంధు సంబరాలు నిర్వహించాలి. శాసన సభ్యులు ఈ సంబరాల విషయంలో ముందుండి నియోజకవర్గ పార్టీ శ్రేణులు అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి. రైతుబంధు సంబరాల్లో భాగంగా కింది కార్యక్రమాలను నిర్వహించవచ్చు. దీంతో పాటు స్థానికంగా ఎవరికైనా మరిన్ని మంచి ఆలోచనలు వస్తే వాటిని కూడా ఈ సంబరాల్లో భాగంగా నిర్వహించవచ్చు అన్నారు కేటీఆర్.
రానున్న సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముందు రైతుబంధు సంబంధిత ముగ్గులను వేసేలా… మహిళా లోకాన్ని కలుపుకొని పోయేలా కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థుల్లో రైతుబంధుపైన ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలి. ఈ రెండు కార్యక్రమాలు చేపడుతే మహిళా లోకం తో పాటు భవిష్యత్ తరానికి కూడా రైతుబంధు గురించిన మరింత అవగాహన కలుగుతుంది
ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ఊరేగింపులతో మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న రెండు వేల ఆరు వందల కుపైగా రైతు వేదికల వద్ద పండగ వాతావరణంలో జనవరి 10వ తేదీన ఘనంగా ముగింపు సంబరాలు చేయాలి. 3 తేదీ 10 వరకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ సంబరాలను వినూత్నంగా చేయాలి. తాము నిర్వహించే ఈ సంబరాలకు స్థానికంగా ఉన్న పత్రికలు, స్థానిక టీవీ ఛానల్, సామాజిక మాధ్యమాల్లో సరైన ప్రచారం వచ్చేలా సమన్వయం చేసుకోవాలి
ఆయా నియోజకవర్గాల్లో రైతులకు అందిన నిధుల వివరాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేయాలి. స్థానిక ప్రజలు అందరికీ చేరేలా శాసనసభ్యులు సవివరమైన ఒక లేఖను రాస్తే బాగుంటుందని సూచన చేశారు కేటీఆర్.