NTV Telugu Site icon

నాయకులను మార్చి బీజేపీ వ్యతిరేకత తగ్గిస్తోందా?

మోదీ సర్కారుకు ప్రజా వ్యతిరేకత తెలిసి వస్తోందా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తోంది. తాజాగా బీజేపీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలే ఇందుకు నిదర్శంగా కన్పిస్తున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లోని సీఎంలను సైతం బీజేపీ హఠాత్తుగా మార్చేస్తుండటంతో ఆపార్టీకి సెగ భారీగానే తాకుతోందని అర్థమవుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మోదీ-షాలు వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలోనే సీఎం మార్పు చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు బీజేపీ ఆయా రాష్ట్రాల్లో వరుసబెట్టి నాయకత్వాన్ని మార్చివేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ సర్కారు వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. సింగిల్ గానే ఆ పార్టీకి మెజార్టీ ఉండటంతో బీజేపీ దేశంలో సంస్కరణలపై ఫోకస్ పెట్టింది. ఇదేక్రమంలో దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీనికి తోడు బీజేపీ హయాంలో పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అటండటంతో పేద, సామాన్యులపై అధిక భారం పడింది. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన సర్కారు పన్నుల పేరుతో దోపిడీకి పాల్పడుతుండటంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో మోదీ సర్కారు అలర్ట్ అవుతోంది. త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరుగున్న నేపథ్యంలోనే బీజేపీ ఆయా రాష్ట్రాల్లోని సీఎంలను వరుసబెట్టి మారుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి మొన్న ఉత్తరాఖండ్, కర్ణాటక సీఎంలను మార్చివేసిన బీజేపీ అధిష్టానం తాజాగా మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనూ అదే సీన్ రిపీట్ చేసింది. ఉన్నట్టుండి సీఎంతోపాటు మొత్తం మంత్రులందరితో బీజేపీ రాజీనామా చేయించడం చర్చనీయాశంగా మారింది.

కర్ణాటకలో యాడ్యూరప్పపై అవినీతి ఆరోపణలున్నాయి. దీనికితోడు ఆయనపై మంత్రుల్లో అసంతృప్తి నెలకొంది. దీని ఫలితంగా జనాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోయిందని మోదీ సర్కారు భావించింది. ఈమేరకు యాడ్డీని తప్పించి మరొకరిని సీఎం పదవిలో బీజేపీ అధిష్టానం కూర్చోబెట్టింది. కొత్తగా సీఎం అయిన బొమ్మైపై సైతం మంత్రుల్లో, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. కొందరు మంత్రులు శాఖలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే కొందరు మంత్రులు సీఎంకు వ్యతిరేకంగా మారడంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలుపు కష్టమేననే టాక్ విన్పిస్తుంది.

యడ్డీ కంటే ముందుగా ఉత్తరాఖండ్ సీఎం విషయంలోనూ మోదీ సర్కారు ఇలానే చేసింది. తాజాగా గుజరాత్ సీఎంను మార్చడంతో బీజేపీపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత భారీగానే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాల ఫార్మూలానే గుజరాత్ లోనూ బీజేపీ వర్కౌట్ చేసింది. సీఎంపై ఆరోపణలు, అసంతృప్తిని సాకుగా చూపిస్తూ అతడి నుంచి రాజీనామాను కోరింది. త్వరలోనే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. కేంద్రంపై వ్యతిరేకతకు తోడు రాష్ట్రంలోనూ వ్యతిరేకత వస్తే ఈ ప్రభావం పార్టీకి నష్టం కలుగుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

మోదీ సొంత రాష్ట్రంలో బీజేపీ ఓటమి పాలైతే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని గ్రహించిన మోదీ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గుజరాత్ లోనూ ఉత్తరాఖండ్, కర్ణాటక ఫార్ములానే బీజేపీ ప్రయోగించింది. సెమీఫైనల్ గా భావిస్తున్న రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని చూస్తోంది. దీనిలో భాగంగానే వరుసబెట్టి ఆయా రాష్ట్రాల్లో సీఎంలను మారుస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. ఇదిలా ఉంటే సీఎంను మారిస్తే మాత్రం ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత తగ్గుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదిఏమైనా ప్రజల్లోని వ్యతిరేకత సెగ మోదీ సర్కారు తాకినట్లే కన్పిస్తోంది.