మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఘటనతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. తనను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషించారని, ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడతా అంటూ చంద్రబాబు శపథం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను రెండున్నర ఏళ్లుగా అనేక రకాలు దూషించారని కానీ ఈ రోజు నా సతీమణిని కూడా దూషించారంటూ మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై యావత్తు టీడీపీ, నందమూర అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. అయితే తాజాగా చంద్రబాబుకు తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. అసెంబ్లీ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా ఫోన్ చేసి పరామర్శించారు. 1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో మైత్రేయన్కు పరిచయాలు ఉన్నాయి. అయితే దీనిపై మైత్రేయన్ ట్విట్టర్ వేదికగా అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్ చేశారు.
