NTV Telugu Site icon

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపడింది. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున లోక్ సభకు అనర్హుడయ్యాడు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రకటించింది. ప్రధాని మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గాను ఇటీవల రాహుల్‌పై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన సూరత్‌ కోర్టు.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ సభ్యత్వంపై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేసింది.
Also Read: IPL 2023 : నేను వచ్చేశా.. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా..సీఎస్కే ఫ్యాన్స్ ఖుషి

ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం దోషిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయం అమలైందని లోక్‌సభ సెక్రటేరియట్ ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Also Read:Baking Soda : అతిగా కేకులు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ మాట్లాడుతూ..దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత దీనిపై విచారించిన న్యాయస్థానం.. రాహుల్‌కు రెండేళ్ల పాటు జైలు శిక్షవిధించింది. ఏదైనా కేసులో నిందితులు దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడినవారికి ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదంటూ ప్రజాప్రాతినిధ్యంచట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా లోక్‌సభ సచివాలయం రాహుల్ పై అనర్హత వేటు వేసింది.

ఈ నోటిఫికేషన్‌పై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ స్పందించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. లోక్‌సభ సచివాలయం ఒక ఎంపీపై అనర్హత వేటు వేయదని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల కమిషన్‌తో సంప్రదించి చేయాల్సి ఉంటుందని తెలిపారు.