మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా “రిపబ్లిక్” విడుదలకు సిద్ధమవుతోంది. ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రిపబ్లిక్’ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహించారు. భగవాన్, పుల్లారావు నిర్మించారు. అక్టోబర్ 1న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అథితిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రస్తావిస్తూ విరుచుకుపడ్డారు.
సాయితేజ్ ఇంకా కోమాలోనే…
సినిమా విడుదల ముందు సాయితేజ్ ప్రమాదానికి గురి కావడం బాధాకరం. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి.. సాయితేజ్ సాయితేజ్ ఆస్పత్రిలో ఉన్నందువల్లే ఈ కార్యక్రమానికి వచ్చా. అతివేగమే సాయితేజ్ ప్రమాదానికి కారణమని ప్రచారం చేశారు. సాయితేజ్ రోడ్డుప్రమాదంపై లేనిపోని కథలు అల్లారు. ఆటోను దాటే క్రమంలో ఇసుకపై జారిపడి సాయితేజ్ కింద పడ్డాడు. సినిమాలో చెప్పిన విలువలు నిజ జీవితంలో అమలు చేయడం కష్టం. సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు, కళ్లు తెరవలేదు. రాజకీయాల్లో దిగజారుడు తనం పెరుగుతోంది. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై ఏవేవో మాట్లాడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే రాజకీయ హింస గురించి మాట్లాడాలి. సినిమా వాళ్ల గురించి కాదు.. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి.
భయపడి కాళ్ల దగ్గరకు వస్తారని…
పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తే భయపడి కాళ్ల దగ్గరకు వస్తారని అనుకుంటున్నట్టున్నారు. వాళ్లు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. నేనయినా, దర్శకుడైనా, నటులైనా చేసిన సినిమాలకే డబ్బులు తీసుకుంటున్నారు.. అడ్డగోలుగా తప్పుడు కాంట్రాక్టులు చేసి వేల కోట్లు సంపాదించలేదు. జనాలను ఎంటర్ టైన్ చేసి డాన్సులు వేసి కిందా మీద పడి, ఎముకలు విరగ్గొట్టుకుని చేస్తే డబ్బులు వస్తున్నాయి. కోట్లు పెట్టుబడితో సినిమాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తుందా? మేము కష్టం పడితే టిక్కెట్లు మీరు అమ్ముకుంటారా? చిత్ర పరిశ్రమ చిన్నది అనుకుంటున్నారు ప్రభావం మాత్రం చాలా పెద్దది. చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద పేర్లు ఉన్నవారు ఉన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకుల్ని మూసుక్కూర్చోమని చెప్పలేరా ? ఇండస్ట్రీ వైపు చూడొద్దని చెప్పలేరా.. మాట్లాడేందుకు మీకు ధైర్యం లేదా ? భయపడడానికి ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్.
ఒళ్లు దగ్గర పెట్టుకోండి… బయటకు లాక్కొచ్చి కొడతారు
వైసీపీ రిపబ్లిక్ అని మాట్లాడితే జనం బయటకు లాక్కొచ్చి కొడతారు. అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు లేకుండా పోతారు. అధికారంలో ఉన్న వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. గఢాఫీ లాంటి నియంతల్నే చేసిన తప్పులు వెంటాడి చివరికి చిన్న కుర్రాళ్లు కొట్టి చంపేశారు. మీడియా దృష్టి పెట్టాల్సింది సినిమా వాళ్ల మీద కాదు అక్రమ అర్జిత రాజకీయ నాయకుల మీద. చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైన అంశం. అందుకే చాలా తేలిగ్గా టార్గెట్ చేసేస్తున్నారు. ఉదాహరణకు తేజుకి బైక్ యాక్సిండెట్. దేశంలో ఇంతకంటే ఇంట్రస్టింగ్ కథనాలు లేవా? వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు ? అనే దాని మీద మాట్లాడండి. కోడి కత్తితో ఒక నాయకుడిని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో పోడిస్తే నాటి గవర్నర్ గారు సైతం దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. అది ఏమయ్యిందో అడగండి. లక్షలాది ఎకరాల పోడు భూముల్లో గిరిజనలు వ్యవసాయం చేసుకుంటుంటే అవి వారికి దక్కడం లేదు? అనే అంశం మీద మాట్లాడండి. ఆరేళ్ల చిన్నారిని అన్యాయంగా, అమానుషంగా హ్యత చేస్తే దాన్ని వదిలేసి తేజ్ 45 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లిపోయాడు అనే దాని మీద కథనాలు ఎందుకు?
స్పైసీగా కథనాలు కావాలంటే…
బాగా స్పైసీగా కథనాలు కావాలి అంటే ఈ మధ్య వైసీపీ సానుభూతిపరులు కొందరు వ్యభిచారాన్ని చట్టబద్దం చేయమంటూ బయటకు వచ్చారు. దాని మీద కథనాలు నడపండి. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి వైసీపీ వచ్చాక కాపు రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడడం ? లేదు అనే అంశం మీద కథనాలు వేయండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారో కథనాలు వేయండి. బోయ కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావడం లేదో దాని మీద కథనాలు నడపిండి.. నేను గౌరవిస్తాను.
ఇడుపులపాయ నేలమాళిగల్లో డబ్బుల కట్టలు
ఇడుపులపాయలో ఉన్న నేలమాళిగల్లో టన్నుల కొద్ది డబ్బుల కట్టలు ఉంటాయని పోలీసు అంటారు. అందులో నిజం ఎంత ఉందో తెలియదు. దాని మీద కథనాలు నడపండి. అలా నడిపితే వాళ్లు ఇళ్లలోకొచ్చి కడతారు.. అందుకే వాళ్ల గురించి మాట్లాడరు. తేజ్ యాక్సిడెంట్ గురించి మాత్రమే మాట్లాడుతారు. అతను అమాయకుడు ఏం చేయలేడు కాబట్టి… సినిమా వాళ్లు అంటే తైతక్కలు వేసేవాళ్లు అని మాట్లాడుతున్నారు.. సినిమా తీయడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది తెలుసా ? చిత్ర పరిశ్రమలో ప్రాంతీయ తత్వానికి, కుల తత్వానికి స్థానం లేదు. ఏ పార్టీ సానుభూతిపరులు ఉన్నా మీకు అన్నం పెడుతున్న పరిశ్రమకు ముందు గౌరవం ఇవ్వండి. చిత్ర పరిశ్రమ జోలికి వస్తే అంతా ఏకమవ్వండి. నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి. మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నా. సినిమాలపై ఆధారపడి హైదరాబాద్ లోనే లక్ష ల మంది బతుకుతున్నారు. మాలో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి అది శత్రుత్వం కాదు.
రేపు మోహన్ బాబు పరిస్థితీ ఇదే !
సినిమావాళ్ల కష్టాలపై మోహన్ బాబు మాట్లాడాలి. చిత్ర పరిశ్రమ గురించి మోహన్ బాబు వైసీపీ నేతలకు చెప్పాలి. ఇవే నిబంధనలు రేపు మోహన్ బాబు విద్యాసంస్థలకూ వర్తిస్తాయి. ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కాబట్టే సినిమా టికెట్లు అమ్మే ఆలోచన… సినిమా టికెట్ల ఆదాయం చూపించి బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వం తీరు మారాలి. మీ వైఖరి మార్చేందుకు ఏం చేయాలో మాకు తెలుసు. తెలుగు చిత్రపరిశ్రమను ఎవరూ అడ్డుకోలేరు, ఆపలేరు.
