గత సంవత్సరం నవంబర్లో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలుదేశాలకు వ్యాప్తి చెందింది. అయితే ఈ వేరియంట్ ఇటీవల భారత్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కరోనా డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. అయితే డబ్ల్యూహెచ్వో చెప్పినదాని కంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 94 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,525కు చేరుకుంది. అయితే మహారాష్ట్రలో 460 ఒమిక్రాన్ కేసులు ఉండగా, ఢిల్లీలో 351, గుజరాత్లో 136, తమిళనాడులో 117, కేరళలో 109, రాజస్థాన్లో 69, తెలంగాణలో 67 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో ఒమిక్రాన్ కేసులు డబుల్ అయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్వో సూచించింది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి.