1. దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా… రాష్ట్రాల వాటా (ఎస్జీఎస్టీ) రూ.28,658 కోట్లు, అంతర్జాతీయ వాటా (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదయ్యాయి.
2.రాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ బాధ్యత ఈ ఏడాది నుంచి మరింతగా పెరుగుతుందన్నారు. వైసీపీ పాలనకు 30 నెలలు పూర్తియిందన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటికీ మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ వందకు వందశాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. క్యాలెండర్ డేట్స్తో సహా అన్ని పథకాలను చెప్పినవాటి చెప్పినట్టుగా పూర్తి చేశామన్నారు.
3.ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోంది.. వస్తే సిద్దంగా ఉన్నాం.పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితం.. నేను దానిపై స్పందించను.కరోనా కారణంగా జనం రోడ్డెక్కలేదు.. దీంతో జగన్ బతికిపోయాడు.175 నియోజకవర్గాలతో సమావేశం అవుతాం.. ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం.లీడర్ల పని చేయకుంటే మారిపోతారు.పార్టీ ఎవరి కోసం త్యాగాలు చేయదు.పని చేయని ఇన్చార్ఝులను పక్కన పెట్టేస్తాం అని ఖరాఖండీగా చెప్పారు చంద్రబాబు.
4. కోవిడ్ మొదటి దశలో ఇండియా నుంచి మలేరియా మెడిసిన్ను వివిధ దేశాలకు ఉచితంగా సప్లై చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ను తయారు చేసిన తరువాత కూడా ఇండియా మిత్ర దేశాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ను మానతవతా దృక్పధంలో అందించింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్కు 5 లక్షల కోవాగ్జిన్ డోసులను సరఫరా చేసింది. ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ మిత్రదేశం.
5.మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నది. ముంబైలో ఉదయం సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంది. రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో త్వరలోనే పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వస్తున్నాయి.
6. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కి గతేడాది కలిసి రాలేదన్న విషయం తెలిసిందే. వరుస పరాజయాలు శర్వా ను పలకరించాయి. జాను, మహా సముద్రం చిత్రాలు శర్వా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లు గా నిలిచాయి. ఇక ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తూ శర్వా కొత్త సినిమాలతో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ‘ఒకే ఒక జీవితం’ షూటింగ్ ని పూర్తి చేసుకోగా, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం సెట్స్ మీద ఉన్నది. చిత్ర లహరి చిత్రంతో సాయి ధరమ్ తేజ్ కి మర్చిపోలేని హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
7. బాలికల వివాహ వయస్సు పెంపునకు ఉద్దేశించిన బాల్య వివాహాల నిషేధం (సవరణ) బిల్లు- 2021తో దేశ వ్యాప్తంగా హడావుడి పెళ్లిళ్లు పెరిగాయి. ఈ బిల్లు చట్టంగా మారితే బిడ్డ పెళ్లి ఆలస్యమవుతుందని ఆడపిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉంది. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా (షరియత్), అప్లికేషన్ యాక్ట్ , ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ – ఈ ఏడు వ్యక్తిగత చట్టాలను ఈ బిల్లుతో సవరిస్తారు. కాబట్టి కొత్త చట్టం అన్ని వర్గాలకు వర్తిస్తుంది.
8.ఈ నూతన సంవత్సరంలోనైనా కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసిన నందమూరి బాలకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్తో మహమ్మారి మరో మారు విజృంభిస్తున్న వేళ అందరూ మరింత బాధ్యతతో మెలుగుతూ పూర్తి శక్తి సామర్థ్యాలతో రోగులకు సేవలు అందేలా చూడాలని సూచించారు.
9.కొత్త సంవత్సరం.. కొత్త ప్రారంభం.. కొత్త జీవితం.. సినీ ఇండస్ట్రీలో గతేడాది కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ జ్ఞాపకాలను వదిలేసి.. న్యూ ఇయర్ లో సరికొత్త విజయాలను అందుకోవడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఇక నేడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త చిత్రాలు.. తమ కొత్త పోస్టర్లను రిలీజ్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్నా “బోళా శంకర్”.. కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ షూటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ”స్వాతిముత్యం”. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది.
10.ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్లతో క్రేజ్ సంపాదించుకున్న అమెజాన్ ప్రైమ్ కొత్తగా క్రీడాభిమానులకు గాలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ ప్రైమ్లో తొలిసారిగా క్రికెట్ లైవ్ ప్రారంభమైంది. శనివారం నాడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆట అమెజాన్ ప్రైమ్లో లైవ్ స్ట్రీమ్ అయ్యింది. దీంతో క్రికెట్ అభిమానులు టీవీ ఛానళ్ల జోలికి వెళ్లకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా క్రికెట్ను వీక్షిస్తున్నారు.
