ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన టౌక్టే తుఫాన్ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తుఫాను ధాటికి పశ్చిమ తీర ప్రాంతం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వేల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. టౌక్టె తుఫాను బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో ముప్పు దూసుకు రాబోతున్నది. ఈసారి తూర్పు తీరంలో ఆ ముప్పు ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. తూర్పు తీరంలోని అండమాన్ కు ఉత్తరాన సముద్రంలో ఈనెల 22 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. 22 న ఏర్పడే అల్పపీడనం 72 గంటల్లో బలమైన తుఫానుగా మారే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తుఫానుకు యాస్ అనే పేరుపెట్టారు. ఈ యాస్ తుఫాను ఈనెల 26 నుంచి 27 మధ్య వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా-బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.