భారత దేశంలో ఆధునిక మహిళలకు పెళ్లి, పిల్లలు అక్కర్లేదు అనుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్.. నేటి మహిళలు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారని, పెళ్లైన తర్వాత కూడా పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదన్న ఆయన.. సరోగసీ ద్వారా సంతానానికి జన్మనివ్వాలని భావిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఇది మానసిక సమస్యలకు దారి తీస్తోందని.. మా మార్పు మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు… ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి..
భారతీయ సమాజంపై పాశ్చాత్య ప్రభావంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి సుధాకర్.. తల్లిదండ్రులను తమతో ఉండనివ్వడానికి పిల్లలు ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించారు.. దురదృష్టవశాత్తు ఈ రోజు మనం పాశ్చాత్య మార్గంలో వెళ్తున్నాం… తల్లిదండ్రులను మనతో కలిసి జీవించడానికి ఇష్టపడటం లేదు.. తాతలు మనతో ఉండటం మర్చిపోయాని పేర్కొన్నారు.. ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరు స్వల్ప, మోస్తరు లేదా తీవ్రమైన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకొచ్చారు.. ఒత్తిడి నిర్వహణ ఒక కళ.. దానిని భారతీయుడు నేర్చుకోవలసిన అవసరం లేదు.. కానీ, దానిని ఎలా నిర్వహించాలో ప్రపంచానికి బోధించాలని సూచించారు. అయితే, మంత్రి సుధాకర్ వ్యాఖ్యపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. ఇది ముమ్మాటికి మహిళలను కించపర్చడమే అంటూ ఫైర్ అవుతున్నారు..