భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం ఏడోరోజుకు చేరింది. ఏడోరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి హరీష్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో మనుషులపై పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఒక్క క్షణం కూడా తీరిక దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో తెలియని మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు. మనిషి ఎంత సంపాదించినా.. ఎన్ని ఆస్తులు ఉన్నా… ఎన్ని పదవులు ఉన్నా చివరకు.. కోరుకునేది ప్రశాంతతే అని.. మనిషికి ఆ ప్రశాంతత చేకూర్చేది ఆధ్యాత్మిక చింతన మాత్రమే అని హరీష్రావు అభిప్రాయపడ్డారు.
Read Also: చంద్రబాబుని వదలని వరద.. మునిగిన ఇల్లు
ఉపనిషత్తుల నుంచి ఈనాటి వేదపండితుల వరకు ఎందరెందరో మనిషికి ప్రశాంతత చాలా అవసరం అని చెప్తూనే ఉన్నారు. భగవంతుని సేవలోనే, భగవంతుడు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనిషి తన ఆందోళనలను మరిచిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. అలాంటి ఆధ్యాత్మిక ఉట్టిపడేలా గత పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది కార్తీకమాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తాము ఏదైనా పని చేస్తే వ్యక్తిగత దినచర్యగా మారుతుందని… అదే అందరూ కలిసి ఏదైనా లక్ష్యం కోసం పనిచేస్తే అది ఉద్యమం అవుతుందని హరీష్రావు వ్యాఖ్యానించారు. అలాగే ఎవరి ఇంట్లో వారు పూజ చేసి దీపం వెలిగిస్తే అది భక్తి అవుతుందని.. అదే అందరూ ఒకచోట చేరి సామూహికంగా కోటి దీపోత్సవంలో దీపాలను వెలిగిస్తే భక్తి ఉద్యమంగా మారుతుందన్నారు. అలాంటి కోటి దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో తనను చౌదరి గారు భాగస్వామ్యం చేస్తున్నారని హరీష్రావు తెలిపారు. ఇది తనకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.