కరోనా వైరస్కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు వ్యాక్సినేషన్పై ఫోకస్ పెట్టాయి.. ఇక, తెలంగాణలో డిసెంబర్ వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్, రెండో డోస్ ఎంత మంది తీసుకున్నారనే వివరాలు పక్కా సేకరించాలని చెప్పారు. ఆశాలు, ఏఎన్ఎంలు, వైద్యులు గ్రామస్థాయి, సబ్సెంటర్ స్థాయి, పీహెచ్సీ స్థాయిలో ప్రణాళికలు వేసుకొని ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని ఆదేశించారు.. ఇదే సమయంలో ప్రజల్లో వ్యాక్సిన్పై ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. వాటికోసం ప్రత్యేకంగా కాలేజీ క్యాంపస్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాయాలు, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లపై దృష్టి సారించాలని.. అక్కడే వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Read Also: టీఆర్ఎస్కు మరో షాక్..! పార్టీకి మాజీ మేయర్ గుడ్బై..
ఇంటింటి సర్వే నిర్వహించి వందకు వంద శాతం కోవిడ్ వాక్సినేషన్ జరిగేలా చూడాలని స్పష్టం చేశారు మంత్రి హరీష్రావు.. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలన్న ఆయన.. గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచండి.. సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీపీ, సుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేపట్టాలి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5.55కోట్ల డోసులు వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3.60కోట్ల డోసులు వేశామని.. మరో 1.90కోట్లు వేయాల్సి ఉందని వెల్లడించారు. కాగా, సిద్దిపేట నుండి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్రావు.. ఆశాలతో, ఏఎన్ఎంలతో, డీఎం అండ్ హెచ్వోలతో మాట్లాడారు.