లఖింపూర్ ఖేరీ ఘటన పార్లమెంట్ సమావేశాలను కుదిపేసింది.. ఆ ఘటనపై చర్చించాలంటూ పార్లమెంట్లోని ఉభయ సభల్లో ప్రతిపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో ఎగువ, దిగువ సభలు మధ్యాహ్నం 2 వరకు వాయిదా పడ్డాయి. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందంటూ సిట్ దర్యాప్తులో వెల్లడికావడంపై పార్లమెంట్లో చర్చ సాగించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి.. లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చించాలంటూ లోక్సభలో కాంగ్రెస్ ఎంపి మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా.. ఇటు రాజ్యసభలో తృణమూల్ ఎంపి సుస్మితా దేవ్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ… ఇవాళ లోక్సభలో మాట్లాడిన ఆయన.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ క్రిమినల్ అంటూ నిప్పులు చెరిగారు.
Read Also: అమ్మాయిల వివాహ వయస్సుపై కేంద్రం సంచలన నిర్ణయం..!
ఇక, లఖింపూర్ ఖేరి ఘటనలో మంత్రి అజయ్ మిశ్రానే నిందితుడని.. వెంటనే అతడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ… లఖింపూర్లో జరిగిన హింసాకాండలో మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించిన రాహుల్.. మంత్రి కుట్ర పన్ని రైతుల్ని చంపేశారని ఫైర్ అయ్యారు.. రైతుల్ని చంపిన మంత్రి రాజీనామా చేయాలని, ఆయన్ను శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. మరో వైపు ప్రతిపక్షాల సభ్యులు ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి… వెల్లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు ఎంపీ.. ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు.. దీంతో పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.
